iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మరో క్షీర విప్లవానికి శ్రీకారం పడింది. జగన్ చొరవతో అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ ప్రారంభమవుతోంది. ఈనెల 25 నుంచి తొలి విడత మూడు జిల్లాల్లో దీనికి ప్రారంభం చేస్తున్నారు. రాష్ట్రమంతా 9899 కేంద్రాల్లో పాలసేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో భాగంగా చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 300 కేంద్రాలతో మొదలుపెడుతున్నారు. దానికి అనుగుణంగా ఏపీ డెయిరీ పునరుత్తేజం దిశగా అమూల్ నేతృత్వంలో చేపడుతున్న ప్రయత్నాలు పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు తోడవుతాయని భావిస్తున్నారు.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వ్యవసాయదారులు అనేక మంది పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ వారికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ప్రధానంగా ప్రైవేట్ డెయిరీ ల హవా కారణంగా వారికి న్యాయం జరగడం లేదనే వాదన ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహకార డెయిరీల వ్యవస్థకు చిక్కులు కల్పించడంతో ప్రైవేటు డెయిరీలు పుంజుకున్నాయి. విజయ డెయిరీలు కునారిల్లగా హెరిటేజ్ వంటివి విజృంభించాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న తీరు జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: బాబు “హెరిటేజ్” పాల బేరం కోసం అమూల్ మీద నిందలా?
రైతుల సంక్షేమం , అభివృద్ధికి కట్టుబడి ఆర్బీకేలు వంటి పలు మార్పులు చేపట్టిన జగన్ ప్రభుత్వం ఇటీవల అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో పాల ఉత్పత్తుల రంగంలో అందెవేసిన చేయిగా అమూల్ యాజమాన్యం ఉంది. వారి సహకారంతో ఏపీ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుని అమూల్ రంగంలో దిగింది. పలు జిల్లాల్లో సర్వే కూడా నిర్వహించింది. దానికి తగ్గట్టుగా ఈనెల 20నుంచి ప్రయోగాత్మకంగా పాల సేకరణ చేస్తుంది. 25 నుంచి అధికారికంగా 300 పాలసేకరణ కేంద్రాల ద్వారా నేరుగా రైతుల నుంచి పాలు కొనుగోలు చేయబోతోంది. గిట్టుబాటు ధరల కల్పన, సకాలంలో చెల్లింపులు, ఇతర ప్రయోజనాలను రైతులుకు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పాల రైతులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
Also Read: అమూల్ శిక్షణా తరగతులు
దశల వారీగా మహిళా సంఘాల పాల ఉత్పత్తిదారుల కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. అందుకు అనుగుణంగా కలెక్టర్లతో కోర్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు డెయిరీలు తక్కువ ధరకే పాలు కొనుగోలు చేస్తూ లాభాలు అర్జిస్తున్న సమయంలో రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు అమూల్-ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం దోహదపడుతుందని అంతా భావిస్తున్నారు. అందులో భాగంగా తొలి దశ పాల సేకరణ కేంద్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయన్నదానిని బట్టి మరింత మెరుగ్గా అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ జరిపేందుకు ప్రణాళికలు సాగుతున్నాయి. గుజరాత్ లో సక్సెస్ ఫుల్ గా పాల ఉత్పత్తిదారులకు అండగా నిలుస్తున్న అమూల్ రాకతో ఏపీలో డెయిరీ రంగం కీలక మార్పులకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.
Also Read: జగన్ సర్కార్ ఒక నిర్ణయం.. రెండు లాభాలు