iDreamPost
android-app
ios-app

కుల అహంకారంపై కొరడా

కుల అహంకారంపై కొరడా

భారతదేశంలో కులాన్ని మించిన వైరస్ కనిపించదు. వేల ఏళ్లు గడిచినా ఏ వ్యాక్సిన్ కూడా ఈ వైరస్ ని ఓడించలేకపోతోంది. వ్యక్తిగత స్థాయి నుంచి సామూహిక స్థాయి వరకు విస్తరించాల్సిన కుల రహిత చైతన్యం ఇంకా మన మనసులకు ఇంకనే లేదు. అందుకే నేటికీ కుల అహంకారం విషం చిమ్ముతూనే ఉంది. తమ కుల అస్థిత్వాన్ని గొప్పగా చాటుకోవడం పరిపాటిగా మారింది. ఈ వైఖరికి చెక్ దిశలో పావులు కదుపుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కుల ఆధారిత ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. అదే పద్దతిని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోనూ అమలు చేయనున్నారు. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ వంతు. వాహనాలపై కుల అస్థిత్వాలను తెలియజేసే స్టిక్కర్లను తొలగించే పనిలోపడింది ఉత్తరప్రదేశ్ సర్కారు.

కులం ఎంత భయంకరమైందంటే అది మనుషుల మధ్య కనిపించని గోడలు నిర్మి్స్తుంది. హింసను ప్రేరేపిస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా మారుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం సమాచాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అయినా కులం తాలుకూ గుర్తింపులను కోల్పోవడానికి ఎవరూ సిద్ధపడరు. అది మాత్రమే కాదు…. గొప్పగా తమ కులాన్ని చాటుకుంటారు. టూ వీలర్స్, కార్లు, లారీలు మొదలు అన్ని రకాల వాహనాలపై ఇప్పటికీ కులాల పేర్లను చూస్తుంటాం. గడిచిన దశాబ్దంన్నర కాలంలో దేశంలో ఈ వైఖరి విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లో వాహనాలపై కులం పేరుతో స్టిక్కర్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి.

దేశంలోనే అది పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో యాదవ్‌, జాట్‌, గుర్జార్‌‌, బ్రాహ్మిన్, పండిట్‌, క్షత్రియ, ఠాకూర్‌‌, రాజ్‌పుత్‌, లోథ్‌లాంటి సామాజిక వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఈ క్రమంలో తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు తమ వాహనాలపై తమ కులాల పేర్లను స్టిక్కర్లుగా వేయించుకుంటారు. ప్రతి 20 వాహనాల్లో ఒక వాహనంపై ఖచ్చితంగా ఏదో ఒక కులం పేరు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడీ ట్రెండ్ కి చెక్ పెట్టేందుకు పూనుకుందీ యూపీ రవాణ శాఖ. కులం స్టిక్కర్లు అంటించిన వాహనాలను సీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు రవాణశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్రకు చెందిన ఓ టీచర్ ప్రధాన మంత్రి కార్యాలయానికి రాసిన లేఖ ఆధారంగా యూపీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. యులాయం సింగ్ అధికారంలో ఉన్న కాలంలో వాహనాలపై యాదవ్ అనే పేరు రాసుకోవడం ఆరంభమైంది. తరువాత క్రమంగా ఈ ట్రెండ్ పెరుగుతూ వచ్చింది. వాహనాలపై కులం పేర్లు రాసుకోవడాన్ని ఒక సామాజిక హోదాగా గుర్తిస్తుండడం ఒక విషాదం. మోటర్ వెహికల్ చట్టం ప్రకారం వాహనాలపై కులాల పేర్లు మాత్రమే కాదు… పోలీస్, ప్రెస్ లాంటి స్టిక్కర్లు కూడా ఉండడానికి వీలులేదు. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారమే యూపీ రవాణా శాఖ కుల అహంకారంపై కొరడా జులిపించడానికి సిద్ధమైంది. వాహనాలపై కులం స్టిక్కర్లను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.

కుల ఆధారిత ప్రాంతాల పేర్లను మార్చడానికి ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులం పేరుతో ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి పేర్లను మార్చాలని నిర్ణయించింది. తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లాలో కుల ఆధారిత ప్రాంతాల పేర్లు మార్చేందుకు పూనుకున్నారు. మొత్తానికి వేళ్లూనుకున్న కులం పునాదులను పెకిలించే ప్రయత్నం మొదలైనట్లు కనిపిస్తోంది.