Idream media
Idream media
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పేర్కొన్నారు. ఏది దుబారానో క్లారిటీ ఇవ్వలేదు. లెక్కలు చెప్పలేదు. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓ ఏడాదిలో చేసిన దుబారా ఖర్చును నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే లెక్కలతో సహా ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి గాను అదనపు నిధుల కోసం అనుబంధ పద్దును నాటి అసెంబ్లీకి సమర్పించారు. ఆ అదనపు నిధులు ఎందుకో తెలుసా.. ప్రచార ఆర్భాటాలకు, చంద్రబాబు స్వదేశీ, విదేశీ పర్యటనలకు. ఎంతో ఏకంగా రూ. 133.05 కోట్లుగా ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే.
విభజన తర్వాత ఏపీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది’ ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు చెప్పే మాట ఇది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం గనుక దుబారా వ్యయం చేయరాదు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు, పొదుపు చేయాలంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇతరులకే ఈ మాటలు వర్తిస్తాయి తప్ప ముఖ్యమంత్రికి కాదని స్వయానా ఆర్థికశాఖ వెలువరించిన లెక్కలే సూచిస్తున్నాయి. అది కేవలం ఒక్క ఏడాదిలో ఇలా మొత్తం ఐదేళ్ల కాలం చూసుకుంటే ప్రచారాలకే వేల కోట్లు లెక్కలు తేలతాయి. ఒక్క ఏడాది పుష్కరాల ప్రచారం, పర్యటనలకే బాబు సుమారు 100 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లుగా నాటి లెక్కలే చెబుతున్నాయి.
సంక్షేమానికి రూ. 1.25 లక్షల కోట్లు
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమానికే భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం రెండేళ్ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో 94.5 శాతం వాగ్ధానాలను పూర్తి చేశారు. ఐదేళ్ల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టి రికార్డు సృష్టించారు జగన్. సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 129 వాగ్ధానాలు చేయగా అందులో ఇప్పటికే 107 హామీలు అమల్లోకి వచ్చాయి. 24 నెలల కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 93,708 కోట్ల రూపాయలు చేరగా… పరోక్షంగా మరో రూ. 31,714 కోట్లు అందించింది జగన్ సర్కార్. మొత్తంగా రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలపై ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
దీన్ని దుబారా అంటారా..
పేదలకు నేరుగా నడదు సహాయాన్ని చేయడాన్ని దుబారా అని ఎవరైనా అంటారా? కరోనా కాలంలో కూడా వారి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లగలిగాయంటే అది ప్రభుత్వం అందించిన పథకాల ద్వారానే. దేశమంతా కరోనాతో అల్లల్లాడుతున్న వేళ కూడా ఏపీలో సంక్షేమ రధం సవ్యంగా కదిలింది. పేద వాడి చేతిలో కరెన్సీ కళకళలాడింది అంటే అది జగన్ సర్కార్ సంక్షేమ పధకాల వల్లనే కదా. ఆర్ధిక సంక్షోభం దేశంలో తలెత్తకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయమని మహా మహా కొమ్ములు తిరిగిన ఆర్ధిక వేత్తలు కరోనా వేళ పాలకులకు సూచించిన సంగతి అందరికీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ప్రజా ధనం పెద్ద ఎత్తున దుబారా అవుతోందని తెగ గాబరా పడుతున్నారు. దానికి అరికట్టాలంటూ ఆయన సూచనలు చేస్తున్నారు. నిజంగా దుబారా ఎక్కడ జరుగుతుందో చెబితే మంచిదే కానీ, ప్రభుత్వం చేసే ప్రతీ ఖర్చునూ దుబారా అనడం సరైనదేనా!