సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఫేస్బుక్ తరచూ హ్యాకర్ల దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఫేస్బుక్ యూజర్ల డేటా లీక్ కాగా ఆ డేటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి కూడా ఉంచారు. తాజాగా మరోసారి ఫేస్బుక్ యూజర్ల డేటా లీక్ అయింది. కానీ అమ్మకానికి ఉంచింది డార్క్ వెబ్ లో మాత్రం కాదు..
వివరాల్లోకి వెళితే ఫేస్బుక్లోని ఒక లోపాన్ని ఆధారంగా చేసుకుని సుమారు 53.3 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లను ఒక వ్యక్తి సేకరించి ఫేస్బుక్ ఖాతాలను ఫోన్ నంబర్లను ఒక డేటాబేస్ గా తయారుచేసి టెలిగ్రామ్లో ఓ బాట్ ద్వారా అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ప్రముఖ సైబర్ నిపుణుడు అలొన్ గాల్ ట్విటర్లో వెల్లడించారు. వీటిలో 60 లక్షల మంది భారతీయుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. కాగా అమ్మకానికి ఉంచిన వ్యక్తి 2019 కి ముందు ఫేస్బుక్లో ఉండే చిన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని ఫేస్బుక్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాకర్ సేకరించగా 2019లో ఆ లోపాన్ని ఫేస్బుక్ సరిచేసింది.
జనవరి 12వ తేదీ నుంచి వీటిని హ్యాకర్ టెలిగ్రామ్ బాట్ ద్వారా విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక్క యూజర్కి సంబంధించిన వివరాలు కావాలంటే 20 డాలర్లు, 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని హ్యాకర్ ధర నిర్ణయించాడు. ఇదే విషయాన్ని మదర్బోర్డ్ నివేదిక కూడా ధృవీకరించింది. ఇప్పటికే పలుమార్లు డేటా లీకేజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్కు ఇది ఇబ్బందికర అంశంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం వాట్సాప్ లోని వ్యక్తిగత డేటాను ఫేస్బుక్తో షేర్ చేసే విధంగా నూతన ప్రైవసీ పాలసీ తీసుకొచ్చినందుకు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన ఎదుర్కొన్న ఫేస్బుక్ యాజమాన్యానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు..