idream media
idream media
ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వ్యవహారం పెద్ద చర్చకు తెరలేపింది. పలు పేర్లు తెరమీదకు రావడంతో మీడియాలో పెద్ద స్థాయిలో ప్రచారం సాగింది. చివరకు ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జీకి అవకాశం ఇచ్చింది. మారిన నిబంధనల ప్రకారం మూడేళ్ల పదవీకాలానికి గానూ హైకోర్ట్ జడ్జీగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు 1994 పంచాయితీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఆర్డినెన్స్ రూపొందించారు. గవర్నర్ ఆమోదం పొందడంతో అమలులులోకి వచ్చింది.
దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం మద్రాస్ హైకోర్ట్ మాజీ జడ్జి కనగరాజుని నూతన ఎస్ఈ సీగా నియమించింది. ఈ మేరకు జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత కనగరాజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశంగా మారింది.
కనగరాజు న్యాయశాస్త్రంలో నిపుణులు. ఆయన సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 9 సంవత్సరాల పాటు హైకోర్ట్ నాయమూర్తిగా విధులు నిర్వహించారు. విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తిగా వి.కనగరాజ్ కి గుర్తింపు ఉంది. సామాజిక స్పృహతో వ్యవహరించారని ఆయనకు పేరుంది. పదవీ విరమణ తర్వాత కూడా న్యాయ సలహాలు ఇచ్చే ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికల నిర్వహణ ఆయన సారధ్యంలో జరగబోతుండడం విశేషం.