iDreamPost

థాంక్స్ బాబు గారు.. మీ వల్లే రాజ్యసభకు వెళుతున్నాం అంటున్న వైసీపీ మంత్రులు

థాంక్స్ బాబు గారు.. మీ వల్లే రాజ్యసభకు వెళుతున్నాం అంటున్న వైసీపీ మంత్రులు

తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదే… ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవులు వొచ్చాయి…
శాసనమండలి రద్దయితే ఏకంగా రాజ్యసభ స్థానం దక్కింది….

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన చిదంబరం,అరుణ్ జైట్లీ లాంటి నాయకులకు కేంద్రంలో మంత్రిపదవులు అనేకసార్లు వొచ్చాయి కానీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు రాష్ట్రంలో మంత్రిపదవులు రావటం చాలా అరుదు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులకు ఓడిపోయిన సంవత్సరానికో, రెండేళ్లకో మంత్రి పదవులు వొచ్చాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరుపున ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణలకు తొలి క్యాబినెట్ లోనే మంత్రి పదవులు దక్కాయి.

తన కోసం పదవులు త్యాగం చేసినవారికి ,తనను నమ్మి తనతో నడిచిన వారికి జగన్ న్యాయం చేస్తాడని పిల్లి సుభాష్ & మోపిదేవి రమణ మంత్రి పదవులు నిరూపించాయి. వారు మంత్రులు అయినా తరువాత ఎమ్మెల్సీ లుగా ఎన్నికయ్యారు.

Also Read: జగన్ రాజ్యసభకు ఎవరిని పంపుతున్నాడు?

ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా , మొత్తం మంత్రివర్గంలో ఒక్క అచ్చెం నాయుడు తప్ప మిగిలిన మంత్రులందరూ ఓడిపోయినా, కొడుకు లోకేష్ పోటీచేసిన తొలి ఎన్నికలో ఓడిపోయినా చంద్రబాబు మాత్రం ప్రజాతీర్పును గౌరవించకుండ నిత్యం ప్రభుత్వాన్ని ఎదో ఒక రూల్ పేరుతో సభలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

శాసనమండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండటంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి పంపటం లేక సెలెక్ట్ కమిటీకీ పంపటమో చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును కూడా రూల్ 7 పేరుతో చర్చకు అనుమతి ఇచ్చి “రూల్ లేదు అయినా నా విచక్షణాధికారం”తో సెలెక్ట్ కమిటీ కి పంపిస్తున్నానని చైర్మన్ షరీఫ్ ప్రకటించి సభను నిరవధికంగా వాయిదావేసి సొంత ఊరు నర్సాపూర్ వెళ్ళిపోయాడు…

ఇంకేముంది రాజధాని వికేంద్రీకరణ ఆగిపోయినట్లే,సెలెక్ట్ కమిటీ ఎప్పటికి తేల్చదు అని టీడీపీ నేతలు,ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆంధ్రజ్యోతి ఉత్సవాలు చేశాయి…

Also Read: రాజ్యసభకు ఆ నలుగురు.. ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

ఈ తలనొప్పి ఎందుకు అనుకొని ప్రభుత్వం ఏకంగా శాసనమండలినే రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.. మళ్ళీ యధావిధిగా ప్రభుత్వ నిర్ణయం చెల్లదని చంద్రబాబు రాజ్యాంగ పాఠాలు చెప్పాడు.. కానీ రాజధాని వికేంద్రీకరణ పనులు మాత్రం వాటి పాటికి అవి కొనసాగుతున్నాయి…

మరో వైపు శాసనమండలి కార్యదర్శి నా మాట వినటం లేదు ,మీరు ఆయన మీద చర్యలు తీసుకోండి అని మండలి చైర్మన్ గవర్నర్ కు విన్నవించుకున్నారు . అయ్యా కార్యదర్శిగా మీకు చట్టం,రూల్స్ గురించి తెలియచెప్పి సభను నిబంధనల ప్రకారం నడిపించడంలో సహాయపడటం నా ఉద్యోగధర్మం అని మండలి కార్యదర్శి చైర్మన్ షరీఫ్ కు ఉత్తరం రాశాడు … ప్రభుత్వాన్ని నిలువరిస్తాం అన్న హెచ్చరిక నుంచి తమ కార్యదర్శి మీద చర్య తీసుకోమని గవర్నర్ను కలిసే వరకు మండలి తంతు కొనసాగింది.

మండలి రద్దు జరిగి మా మంత్రిపదవులు పోయినా పర్వాలేదని పిల్లి సుభాష్ మరియు మోపిదేవి వెంకట రమణ బహిరంగ ప్రకటన చేశారు ..

Also Read: నెల్లూరు రెడ్డిగారు లేటయ్యారు …!!రైలెళ్లాక స్టేషన్ కొచ్చారు !!

మండలి రద్దు ఎప్పుడు పూర్తవుతుందో కానీ అది మరోసారి సమావేశం జరిగే అవకాశాలు లేవు.జగన్ మాత్రం మరోసారి నన్నునమ్మిన వాళ్ళను వదులుకోను అంటూ పిల్లి సుభాష్ మరియు మోపిదేవి వెంకట రమణలను రాజ్యసభ కు ఎంపిక చేశాడు . ఈ ప్రకటనతో మండలి రద్దు అప్పుడు బీసీ నేతలైన పిల్లి సుభాష్ మరియు మోపిదేవి వెంకట రమణలకు అన్యాయం చెయ్యటానికే జగన్ మండలిని రద్దు చేస్తున్నాడని రాసిన పత్రికల నోట్లో వెలక్కాయ పడట్లయింది.

అసలు మండలి రగడే లేకుంటే పిల్లి సుభాష్ మరియు మోపిదేవి వెంకట రమణలకు రాజ్యసభ అవకాశం వచ్చేదే కాదు.. చంద్రబాబు చాణక్య ఎత్తుగడ పేరుతో చేసిన రాజకీయంతోనే పిల్లి సుభాష్ మరియు మోపిదేవి వెంకట రమణ లు శాసనమండలి నుంచి రాజ్యసభకు వెళ్లగలుగుతున్నారు..

ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక నాయకుడి మౌనరోదన వర్ణించలేనిది… ఆయన ఎమ్మెల్యేగా చివరిసారి గెలిచింది 2004 ఎన్నికల్లో ఆ తరువాత ఆయన స్వయంగా ఒకసారి ,ఆయన సోదరుడు మరో రెండుసార్లు ఓడిపోయినా చంద్రబాబు ఆయన్ను 2014లో మంత్రిని చేశాడు … 2016 నుంచి రాజకీయ చరమాంకంలోకి వస్తున్నాను, నన్ను రాజ్యసభకు పంపండి అని ఎంత బతిమిలాడినా చంద్రబాబు ఆ నాయకుడికి అవకాశం ఇవ్వలేదు.. ఇప్పుడు పిల్లి సుభాష్ , మోపిదేవి రమణలను చూసి ఆయన పడే వేదన వర్ణించలేము…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి