iDreamPost

సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

  • Author Soma Sekhar Published - 08:27 AM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 08:27 AM, Wed - 23 August 23
సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

ఎప్పుడూ లేనంత ప్రేమను చూపించింది ఆ భార్య. దీంతో భార్యకు తనపై ఎంత ప్రేమో అనుకున్నాడు ఆ భర్త. కానీ ఆ ప్రేమ వెనుక దాగున్న మాస్టర్ ప్లాన్ ను అర్ధం చేసుకోలేకపోయాడు పాపం ఆ భర్త. తన ఒడిలో తలపెట్టుకొమ్మని ప్రేమగా అడగడంతో.. అలాగే చేశాడు. కానీ అప్పటికే తన ప్లాన్ ప్రకారం అక్కడ ఉంచిన ప్రమాదాన్ని అతడు గుర్తించలేకపోయాడు. పక్కా స్కెచ్ తో తన భర్తను ప్రియుడితో హత్య చేయించింది ఓ భార్య. ఈ హత్యను కాస్త రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ ఇది సినిమా కాదు.. నిజజీవితం. అందుకే దొరికిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు(33), జానకి (24) దంపతులు. చిన్నా చితక కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకునే వారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పాతకృష్ణదేవిపేటకు చెందిన తాపీ మేస్త్రీ అయిన చింతల రాము (34)తో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న అప్పలనాయుడు ఆమెను పని మాన్పించాడు.

దాంతో అప్పలనాయుడుపై కోపం పెంచుకున్నారు ఇద్దరు. తమకు అడ్డుగా ఉన్న అతడిని ఎలాగైనా అంతమెుందించాలని పన్నాగం పన్నారు. అందులో భాగంగానే సినిమా స్టైల్లో స్కెచ్ వేసి.. భర్తను నమ్మించి ఈ నెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకెళ్లింది జానకి. దైవ దర్శనం తర్వాత తిరుగుప్రయాణంలో తాండవ నది గట్టు దాటాక.. బహిర్భూమికి వెళ్లాలంటూ బైక్ ఆపించింది. పక్కనే ఉన్న జీడితోటలోకి భర్తను కూడా తీసుకెళ్లింది. కాసేపు ఇక్కడే కూర్చుందాం అని చెప్పడంతో ఇద్దరు అక్కడ కూర్చున్నారు. భర్త తలను ఒడిలో పెట్టుకొమ్మని జానకి చెప్పింది. భార్య అంత ప్రేమగా అడగడంతో.. అతడు అలాగే చేశాడు.

అయితే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్నాడు జానకి ప్రియుడు రాము. అతడు తల జానకి ఒడిలో పెట్టగానే తన వెంట తెచ్చుకున్న సుత్తితో అప్పలనాయుడు తలపై గట్టిగా కొట్టాడు. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అతడిని రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం రాము అక్కడి నుంచి పారిపోగా.. భర్త మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసింది జానకి. వచ్చిపోయే వారిని నమ్మించాలని ప్రయత్నించింది. కానీ ఆ గాయాలను చూసిన స్థానికులకు అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. దీంతో జానకి అసలు కథ వెలుగులోకి వచ్చింది. అప్పలనాయుడిని హత్య చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇదికూడా చదవండి: చిత్తూరు వాసికి ఉరి శిక్ష! ఎంతటి పాపం చేశాడో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి