iDreamPost
android-app
ios-app

కేసీఆర్‌ సభ.. మంత్రుల్లో టెన్షన్‌

కేసీఆర్‌ సభ.. మంత్రుల్లో టెన్షన్‌

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీలూ హాలియాలో సభలు నిర్వహించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రచారాన్ని వేడెక్కించాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే హాలియాలో జరిగిన సభకు హాజరైన కేసీఆర్‌ ఈ నెల 14న మళ్లీ అక్కడే జరగనున్న సభకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ తిరుపతి సభను రద్దు చేసుకోగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు కూడా అనుమతులు నిరాకరించాలని పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ పరిశీలకులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసులపై ఉత్కంఠ ఏర్పడింది. అది అలా కొనసాగుతుండగానే సీఎం సభ విజయవంతానికి మంత్రులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ సభకు ముందే ఊపు పెంచాలని…

ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి పోటీలో నిలవడంతో ఆ పార్టీ నుంచి గట్టి పోటీ ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ అనే విధంగా తెలంగాణ ఎన్నికలు నాగార్జునసాగర్‌లో మాత్రం సీన్‌ మారింది. ఈ క్రమంలో హాలియా సభకు సీఎం కేసీఆర్‌ వస్తుండడంతో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం సభకు జనసమీకరణ, తెరవెనక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, సీఎం సభకు కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని, లేదంటే జరిమానాలు విధిస్తామని నిర్వాహకులకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. 14న సాయంత్రం సభ జరగనుండగా ఆ రోజు ఉదయం నుంచే ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా సున్నంతో బాక్సులు వేయిస్తామని కలెక్టర్‌ పీజే పాటిల్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామన్నారు. సీఎం సభకు 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 20 ఎకరాల్లో లక్ష మందితో బహిరంగ సభ కాగా 30 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమిత సిబ్బందితో భారీగా ఫైన్‌లు వేయడం సాధ్యమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ పక్షాన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సినీనటులు విజయశాంతి, బాబూమోహన్‌, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు స్థానికంగా మకాం వేశారు. సభలు, రోడ్‌షోలతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీలు హోరెత్తిపోతున్నాయి. సీఎం సభకు కరోనా నిబంధనలు టీఆర్‌ఎస్‌ ఉల్లంఘనలపై వీడియో, ఫొటో ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఇప్పటికే ప్రకటించారు.