iDreamPost

ఆస్ట్రేలియా పై టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

  • Author Soma Sekhar Published - 08:23 AM, Wed - 29 November 23

ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 223 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేశారు భారత బౌలర్లు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం..

ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 223 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేశారు భారత బౌలర్లు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం..

  • Author Soma Sekhar Published - 08:23 AM, Wed - 29 November 23
ఆస్ట్రేలియా పై టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

ప్రత్యర్థి ముందు 223 పరుగులు లక్ష్యం.. గత రెండు మ్యాచ్ ల్లో విజయాలు. ఇంకేముంది ఈసారి కూడా టీమిండియా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలుత రాణించిన టీమిండియా బౌలర్లు 68 పరుగులకే 3 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో కూడా భారత్ గెలిచి సిరీస్ ను ఒడిసిపట్టుకుంటుందని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా రెచ్చిపోయిన మ్యాక్స్ వెల్ మ్యాచ్ ను టీమిండియా నుంచి లాక్కొని సిరీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాడు. మ్యాక్సీ థండర్ ఇన్నింగ్స్ ముందు భారత బౌలర్లు చేతులెత్తేసి.. ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది.

సిరీస్ నిర్ణయాత్మకమైన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బౌలర్లపై గైక్వాడ్ ఓ యుద్ధాన్నే ప్రకటించాడు. కేవలం 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో కెప్టెన్ సూర్య కుమార్(39), తిలక్ వర్మ(31*) రాణించారు. అనంతరం 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. దీంతో తొలి వికెట్ నష్టపోయేటప్పటికి 4.2 ఓవర్లలోనే 47 రన్స్ చేసింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు వెంట వెంటనే రెండు వికెట్లు(ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్) పడగొట్టారు. దీంతో 68 రన్స్ కు 3 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. మ్యాచ్ ను భారత్ నుంచి దూరం చేశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. చెత్త బౌలింగ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా తొలి రెండు మ్యాచ్ లు గెలిచింది. ఆ రెండు మ్యాచ్ లు బ్యాటర్ల పుణ్యమాని విజయం సాధించింది. ఈ మ్యాచ్ ల్లో భారత బౌలర్లు ఏ మాత్రం ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయారు. యువ బౌలర్ల సత్తాను పరీక్షిస్తున్న సెలెక్టర్లకు తీవ్ర నిరాశను మిగుల్చుతూ.. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు టీమిండియా బౌలర్లు. ఇక తాజాగా గుహవాటి వేదికగా జరిగిన 3వ టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం చెత్త బౌలింగే. ఈ మ్యాచ్ లో మూకుమ్మడిగా విఫలం అయ్యారు బౌలర్లు. తొలుత 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ పై పట్టు సాధిస్తున్న క్రమంలోనే మ్యాక్స్ వెల్ భారత బౌలర్లపై ఒత్తిడిని క్రియేట్ చేశాడు. వారిపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ.. మ్యాచ్ ను లాగేసుకున్నాడు. మరీ ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను చీల్చి చెండాడాడు మ్యాక్సీ. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మ్యాక్స్ వెల్ తన విశ్వరూపం చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ 44, ప్రసిద్ధ్ కృష్ణ 68 ఘోరంగా విఫలం అయ్యారు.

2. సూర్య కెప్టెన్సీ

222 పరుగులు లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బౌలర్లతో పాటుగా వారిని నడిపించే నాయకుడిపై కూడా ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లను ఉపయోగించుకుంటూ.. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం కెప్టెన్ ముఖ్య లక్షణం. కానీ ఈ మ్యాచ్ లో సూర్య కెప్టెన్సీలో విఫలం అయ్యాడనే చెప్పాలి. చివరి రెండు ఓవర్లకి ఆసీస్ విజయానికి 43 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ అక్షర్ కు ఇవ్వడం..20వ ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఇవ్వడం సూర్య చేసిన ప్రధాన తప్పిదాలు. మ్యాక్స్ వెల్ విధ్వంసాన్ని అడ్డుకోవడంలో సూర్య సక్సెస్ కాలేకపోయాడు. ఫీల్డింగ్ సెటప్ లో కూడా సూర్య తడబడ్డాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమికి సూర్య కెప్టెన్సీలో విఫలం కావడం కూడా ఓ కారణమే.

3. పెనాల్టీ

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని శాసించిన కారణాల్లో పైవాటితో పాటుగా మరో కీలకమై అంశం కూడా ఉంది. అదే పెనాల్టీ.. ఇటీవలే ఐసీసీ కొత్తగా ఈ రూల్ ను తీసుకొచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ లు ఆసల్యంగా ముగుస్తున్నాయి. దీంతో ఆర్థిక పరమైన అంశాలతో పాటుగా ఇతర విషయాలపై ఇది ప్రభావం చూపుతోంది. అయితే స్లో ఓవర్ రేట్ సమస్యకు పరిష్కారానికి ఇప్పటికే కెప్టెన్ల ఫీజులో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ ఈ సమస్య పరిష్కారానికి మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. నిర్ణీత టైమ్ లో బౌలింగ్ చేయకపోతే.. 30 యార్డ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ను తక్కువ పెట్టే నిబంధన తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా నిలిచింది. టీమిండియా బౌలర్లు టైమ్ కు బౌలింగ్ చేయకపోవడంలో ఐదుగురు ఆటగాళ్లు సర్కిల్ లోపలే ఉండటం.. నలుగురు మాత్రమే బయట ఉండటం ఆసీస్ విజయానికి కలిసొచ్చింది. ఇక ఈ రూల్ తో పాటుగా పెనాల్టీగా 5 విధించే నిబంధన కూడా ఐసీసీ తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ మ్యాచ్ ల ఫలితాల్నే శాసిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమికి మీరు ఏ అంశాలు కారణమైయ్యాయని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి