iDreamPost

ఛీ.. నువ్వింత అసూయపరుడివా? పాండ్యాపై ఫ్యాన్స్‌ మండిపాటు!

  • Author singhj Published - 08:40 AM, Wed - 9 August 23
  • Author singhj Published - 08:40 AM, Wed - 9 August 23
ఛీ.. నువ్వింత అసూయపరుడివా? పాండ్యాపై ఫ్యాన్స్‌ మండిపాటు!

వెస్టిండీస్​పై ఎదురైన వరుస పరాజయాల నుంచి ఎట్టకేలకు భారత జట్టు కోలుకుంది. అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ.. ఘన విజయంతో వాటికి అదిరిపోయే రీతిలో సమాధానం చెప్పింది. విండీస్​తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 రన్స్ చేసింది. రోమన్ పావెల్ (40 నాటౌట్), బ్రెండన్ కింగ్ (42) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/28) చక్కగా బౌలింగ్ చేశాడు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), శుబ్​మన్ గిల్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో టీమిండియాలో కలవరం మొదలైంది. అసలే ఫామ్​లో లేని సూర్య కుమార్ యాదవ్ ఏం చేస్తాడోనని అందరూ అనుకున్నారు. కానీ మిస్టర్ 360 డిగ్రీ తిరిగి ఫామ్​ను అందుకుంటూ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. గ్రౌండ్​ నలువైపులా ఎడాపెడా ఫోర్లు, సిక్సులు కొడుతూ టీమ్​ను వడివడిగా విజయం వైపు నడిపించాడు. సూర్య (83)కు తోడుగా తెలుగు తేజం తిలక్ వర్మ (49 నాటౌట్) మరోమారు అద్భుతంగా రాణించాడు.

తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించిన తిలక్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. సూర్య కుమార్ ఔటైనా క్రీజులో తిలక్ వర్మ ఉండటంతో భారత్ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. అతడికి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) రాణించడంతో భారత్ సులువుగా విజయ తీరాలకు చేరుకుంది. అయితే పాండ్యాపై క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. యువ ఆటగాడు తిలక్​ వర్మ(49 నాటౌట్) హఫ్ సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా.. హార్దిక్ అతడికి స్ట్రైక్ ఇవ్వలేదని మండిపడుతున్నారు.

లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ మాదిరిగా ఫినిషర్ అనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత అసూయపరుడివా అంటూ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ జన్మలో నువ్వు ధోనీవి కాలేవంటూ విమర్శలకు దిగుతున్నారు. అలాగే ఓ మ్యాచ్​లో కోహ్లీ-ధోని మధ్య జరిగిన ఒక ఘటనను గుర్తుచేస్తున్నారు. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువైన ఆ మ్యాచ్​లో ఫోర్ లేదా సిక్స్ కొట్టి మ్యాచ్​ను ముగించే ఛాన్స్ ఉన్నా.. ధోని బాల్​ను డిఫెన్స్ చేశాడు. దీంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు.

కోహ్లీ అప్పటికే స్టార్‌ ప్లేయర్‌. అతడి ఖాతాలో చాలా సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. టీమ్‌లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్‌. అయినా కూడా ధోని అతడు సెంచరీని కంప్లీట్‌ చేసుకునే ఛాన్స్‌ ఇచ్చాడు. కానీ, ఇక్కడ తిలక్‌ వర్మ యువ క్రికెటర్‌. కెరీర్‌లో కేవలం మూడో మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్నాడు. అలాంటి ఆటగాడు హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకుంటే అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పైగా వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ చేయడం ఒక ఆటగాడి కన్​సిస్టెన్సీని బిల్డ్‌ చేస్తుంది. కానీ, ఇవ్వన్ని పట్టించుకోని పాండ్యా.. ఏదో మ్యాచ్‌ మొత్తాన్ని తానే ఒంటిచేత్తో గెలిపించినట్లు అనవసరపు సిక్స్‌తో మ్యాచ్‌ ముగించి విమర్శల పాలవుతున్నాడు. మరి.. ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి