iDreamPost

గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు, కట్టడాలు కూల్చేసిన అధికారులు

గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు, కట్టడాలు కూల్చేసిన అధికారులు

విశాఖనగర పరిధిలో ఉన్న గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపునుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది ఇప్పటికే దానికి అనుగుణంగా సంకేతాలు ఇచ్చిన రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చేవేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రధాన ద్వారాన్ని తొలగించారు. ప్రహారీ గోడ కొంత భాగం నేలమట్టం చేశారు. సెక్యూరిటీ రూములు కూడా తొలగింపు ప్రక్రియ సాగుతోంది.
ఉదయాన్ని రంగంలో దిగిన అధికారులు గీతం సిబ్బందికి సూచనలు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు తొలగిస్తూ తెలిపారు. ఎండాడ, రిషికొండ పరిధిలో విలువైన భూములు కాజేసిన నేపథ్యంలో ఈ తొలగింపు ప్రక్రియ సాగుతోంది. గీతం వర్సిటీ ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు.

చంద్రబాబు బంధువు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి సారధ్యంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యింది. తొలుత సాధారణ విద్యాసంస్థగా ఏర్పాటు చేసి ఆ తర్వాత క్రమంగా విస్తరించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమించారనే అభియోగాలున్నాయి. ఎంవీవీఎస్ మూర్తి మరణానంతరం బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఈ సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో భరత్ టీడీపీ తరుపున విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆక్రమణల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయంగానూ చర్చ రేకెత్తిస్తోంది.

చంద్రబాబు హయంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు వివిధ సంస్థల పేర్లతో విలువైన స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగించినా చూసీ చూడనట్టు వదిలేశారు. చివరకు విశాఖలో భారీ భూకుంబకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత జగన్ సహా విపక్ష నేతలు ఆందోళన చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం దర్యాప్తుకి పూనుకుంది. ఇక ఇటీవల సబ్బం హరి స్వయంగా సీతమ్మధారలో ప్రజావసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని ఆక్రమిస్తే జీవీఎంసీ తొలగించింది. ఇప్పుడు గీతం వంతు వచ్చింది. రూ.100 కోట్లకు పైగా విలువైన స్థలాలు గీతం ఆక్రమణలో ఉన్నాయని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. చివరకు ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఎంతమేరకు వాటికి విముక్తి కలిగిస్తారన్నది ఆసక్తికరమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి