iDreamPost

చెప్పకపోయినా ఓటేస్తారు.. కానీ ఓటేసేందుకు ఏం వెంటబెట్టుకెళ్లాలో చెప్పాలి కదా నిమ్మగడ్డ గారు..?

చెప్పకపోయినా ఓటేస్తారు.. కానీ ఓటేసేందుకు ఏం వెంటబెట్టుకెళ్లాలో చెప్పాలి కదా నిమ్మగడ్డ గారు..?

ఓటు విలువను గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనూ, తాజాగా జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. పట్టణ ఓటర్లు చైతన్యవంతులని, ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్‌లో ఓటు వేయాలని సూచించారు. ఇలా పంచాయతీ ఎన్నికలు జరిగిన నాలుగు దశల్లోనూ చెప్పారు. అంతేకానీ పోలింగ్‌ వేళ ఓటర్లు ఏమి తీసుకెళ్లాలి..? ఏమి తీసుకెళ్లకూడదు..? అనే ముఖ్యమైన విషయాలు మాత్రం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పలేదు. యంత్రాంగం ద్వారా చెప్పించలేదు. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఓటర్లు ఓటర్‌ స్లిప్పుతోపాటు ఆధార్‌కార్డు తప్పని సరిగా తీసుకురావాలని పోలింగ్‌బూత్‌ సిబ్బంది చెబుతున్నారు. కానీ ఈ విషయం ఎన్నికల సంఘం కమిషనర్‌ గానీ, అధికారులు గానీ ముందుగా తెలియపరచలేదు. తీరా పోలింగ్‌ బూత్‌కు వెళ్లిన తర్వాత అసలు విషయం చల్లగా చెబుతున్నారు. సెల్‌ఫోన్‌ ఉన్న ఓటర్‌ను పోలింగ్‌ బూత్‌ బయటే పోలీసులు అడ్డుకుంటున్నారు. సెల్‌ఫోన్‌తో లోపలికి వెళ్లడానికి అనుమతిలేదని ఖరాకండిగా చెబుతున్నారు. వెంట తెచ్చుకున్న ఫోన్లు ఎవరి చేతిలో పెట్టాలో తెలియక ఓటర్లు తిరిగి ఇంటికి వెళుతున్నారు. వారిలో కొంత మంది తిరిగి మళ్లీ వస్తున్నారు. మరికొంత మంది రావడం లేదు.

పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి గ్రామీణ ఓటర్లకు ఎదురైంది. అయితే గ్రామాల్లోనే పోలింగ్‌ బూత్‌లు ఉండడం వల్ల.. వారు ఆధార్‌ కార్డులు తెచ్చుకునేందుకు, ఫోన్లు ఇంటి వద్ద పెట్టి వచ్చేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదు. నిమిషాల్లో మళ్లీ పోలింగ్‌ బూత్‌లకు వచ్చారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని గ్రామంలోని ఓటర్లకు అప్పటికప్పుడు తెలియజేశారు. పోలింగ్‌ మొదలైన తొలి గంటలోనే సమస్య పరిష్కారమైంది. కానీ పట్టణాల్లో మాత్రం ఓటర్లకు ఇబ్బందులు తప్పలేదు. పోలింగ్‌ బూత్‌కు, ఓటర్ల గృహాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఆధార్‌ కార్డులు తెచ్చుకునేందుకు, సెల్‌ఫోన్లు ఇంటి వద్ద పెట్టి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎండ ఎక్కువగా ఉండడంతో తిరిగి మళ్లీ పోలింగ్‌ బూత్‌కు వచ్చేందకు పలువురు ఆసక్తి చూపలేదు.

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు : జోరుగా పోలింగ్‌.. మంత్రి ఓటు గల్లంతు

దొంగలు పడ్డ ఆర్నేళ్లకు కుక్కలు మొరిగాయన్న సామెత మాదిరిగా.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆలస్యంగా మేలుకొన్నారు. సెల్‌ఫోన్లు ఉన్నా కూడా ఓటర్లను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించాలంటూ హడావుడిగా ఓ సర్కులర్‌ జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ సర్కులర్‌ ఎన్నికల సంఘం కార్యలయం విడుదల చేసింది. అప్పటికే పోలింగ్‌ సమయం సగానికిపైగా ముగిసిపోయింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తిరిగి ప్రారంభమైనప్పటి నుంచీ తనకు తాను ఓ మోనార్క్‌ మాదిరిగా ఫీల్‌ అయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మీడియాలో ప్రచారం కోరుకున్నారు. ప్రభుత్వంతో ఎడ్డమంటే తెడ్డమనేలా వ్యవహరిస్తుండడంతో టీడీపీ శ్రేణలు సోషల్‌ మీడియలో, టీడీపీ అనుకూల మీడియా నిమ్మగడ్డను హీరోలా, పోరాటు యోధుడు మాదిరిగా కీర్తించింది. ఈ తరహా భజనకు అలవాటుపడిన నిమ్మగడ్డ.. ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టకుండా.. ఏకగ్రీవాలు, రీనామినేషన్లు, కోర్టు వివాదాలు, అధికార పార్టీ నేతలతో వాగ్వాదాలు, ఓటు వేయాలంటూ సందేశాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఓటర్లకు పోలింగ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం ఒక్కటీ చేయలేదు. పుణ్యకాలం కాస్త తెల్లారాక సెల్‌ఫోన్లతో వచ్చినా అనుమతించాలనే ఆదేశాల వల్ల ఫలితం ఏముంటుంది..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి