iDreamPost

లేక లేక పుట్టిన పాప.. ఇంత దారుణం ఎలా చేయగలిగావ్ తల్లీ..

లేక లేక పుట్టిన పాప.. ఇంత దారుణం ఎలా చేయగలిగావ్ తల్లీ..

అందమైన జీవితం.. ఆర్థికంగా ఏ లోటు లేదు. ఒక్కటే బాధ.. పిల్లలు లేరని, కానీ ఆ లోటును కూడా తీరుస్తూ ఐదేళ్లకు పండంటి పాప పుట్టింటి ఆ దంపతులకు. తల్లిని విడిచి పాప ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది. అలాగే పాపను విడిచి తల్లి ఉండలేకపోయేది. సజావుగా సాగిపోతున్న ఆ కాపురంలో అలజడి రేగింది. ఏ కూతురు కోసం అయితే తపన పడిందో.. ఆ బిడ్డను కడతేర్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది కన్నతల్లి. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ప్రసాదం పాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తగరం అరుణ్ కుమార్, జోజి రాణిలకు 2015లో వివాహమైంది. అరుణ్ గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన ఐదేళ్లకు వీరికి పాప పుట్టింది.

ఆ పాపకు మేరీ జెస్సీ అని పేరు పెట్టుకున్నారు.  జోజి రాణి తన తల్లిదండ్రులకు దగ్గరగా నివాసం ఉంటుంది. పాప ఎక్కువగా వారి దగ్గరే ఉంటుంది. అయితే రాణి కొన్ని సంవత్సరాల నుండి మానసికంగా బాధపడుతుంది. పెళ్లికి ముందే ఆమె ఓ సారి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించగా.. ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బ్రతికింది. దీంతో రాణిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే పెళ్లి చేసి పంపించాక కూడా ఆమె మానసిక పరిస్థితి మెరుగుపడలేదు సరికదా.. దిగజారడం మొదలయ్యింది. అస్తమాను తనకు చనిపోవాలని ఉందని తల్లిదండ్రుల వద్ద వాపోవడంతో ఆమెను మందలించేవారు. నువ్వు చనిపోతే పిల్లను ఎవరు చూస్తారంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసేవారు. అలాగే ఆమెకు నాటు వైద్యం కూడా ఇప్పిస్తున్నారు.

అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. గురువారం భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత.. భార్య రాణికి ఫోన్ చేశాడు. ఎంతకు ఆమె ఫోన్ తీయకపోవడంతో అనుమావం వచ్చి బావమరిదికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. అతడి ఇంటికి వెళ్లి చూడగా.. తలుపులు, కిటికీలు అన్ని మూసి ఉన్నాయి. తలుపు తట్టినా తీయకపోవడంతో, తండ్రి అబేద్నగో సాయంతో తలుపులు పగుల గొట్టాడు. లోపలకు వెళ్లి చూడగా మంచంపై పాప జెస్సీ అచేతనంగా, అక్క రాణి రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూశారు. కుమార్తె, మనవారిలిని చూసి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సోదరుడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసుల ప్రాధమిక విచారణను బట్టి.. రాణి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. పాపను హత్య చేసి, ఆపై ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. పాప జెస్సీని మెడకు చార్జర్ వైరును బిగించి, ఊపిరాడకుండా చేయడంతో చనిపోయిందని, ఆ తర్వాత రాణి కత్తి తీసుకుని మెడపై , ఎడమ కట్టుపై లోతుగా కోసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో తీవ్ర రక్త స్రావమై చనిపోయిందని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అక్క, బావ మధ్య ఎటువంటి గొడవలు లేవని మృతురాలి సోదరుడు పోలీసులకు తెలిపారు.  లేక లేక పిల్ల పుడితే.. ఇలా ఎలా చేశావమ్మా అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి