iDreamPost

కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా 170 జిల్లాలను గుర్తించిన కేంద్రం

కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా 170 జిల్లాలను గుర్తించిన కేంద్రం

కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దేశవ్యాప్తంగా 170 కరోనా హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటికే కంటైన్మెంట్,హాట్‌స్పాట్స్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించినందున కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాలలో డోర్ టూ డోర్ సర్వే చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్‌ రాష్ట్రాలకు ప్రత్యేకంగా లేఖ రాశారు.హాట్‌ స్పాట్‌ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్‌ ప్రదేశాల జాబితాను కూడా రాష్ట్రాలకు కేంద్రం పంపింది.

హాట్‌స్పాట్‌ రాష్ట్రాల జాబితాలో 22 జిల్లాలతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.తర్వాత స్థానంలో 14 జిల్లాలతో మహారాష్ట్ర ఉంది.అలాగే ఉత్తరప్రదేశ్‌లో 13, రాజస్థాన్‌లో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11,ఢిల్లీలో 10 హాట్‌స్పాట్‌లను గుర్తించారు.

ఇక తెలుగు రాష్ట్రాలలో 19 జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్‌గా కేంద్రం గుర్తించింది.

తెలంగాణలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాల వివరాలు:

హైదరాబాద్‌,నిజామాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా హాట్‌స్పాట్ జిల్లాల వివరాలు:

విశాఖపట్నం,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,కృష్ణా,గుంటూరు, ప్రకాశం,నెల్లూరు,కడప, కర్నూలు,అనంతపురం, చిత్తూరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి