iDreamPost

రైళ్లలో నకిలీ TTEల గుట్టురట్టు! తెనాలి కేంద్రంగా తెగించారు!

  • Published Nov 30, 2023 | 2:57 PMUpdated Nov 30, 2023 | 2:57 PM

మెడలో రైల్వే టీసీ అనే ట్యాగ్ వేసుకుని.. చేతిలో నకిలీ రసీదు బుక్ పట్టుకుని.. టికెట్ లేకుండా ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ దోచుకుంటున్న వారి గుట్టురట్టయ్యింది. ఆ వివరాలు..

మెడలో రైల్వే టీసీ అనే ట్యాగ్ వేసుకుని.. చేతిలో నకిలీ రసీదు బుక్ పట్టుకుని.. టికెట్ లేకుండా ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ దోచుకుంటున్న వారి గుట్టురట్టయ్యింది. ఆ వివరాలు..

  • Published Nov 30, 2023 | 2:57 PMUpdated Nov 30, 2023 | 2:57 PM
రైళ్లలో నకిలీ TTEల గుట్టురట్టు! తెనాలి కేంద్రంగా తెగించారు!

గ్యాంగ్ సినిమా చూశారా.. అందులో హీరో తనతో పాటు కొందరిని తీసుకుని వెళ్లి.. నిజమైన ఐటీ అధికారులుగా.. అవినీతిపరులు, అక్రమ సంపాదన ఉన్న వారి ఇళ్ల మీద దాడి చేస్తూ.. డబ్బును కొల్లగొట్టేవారు. సినిమా కాబట్టి వాళ్లు కేవలం అక్రమార్జన చేసిన వాళ్లనే టార్గెట్ చేశారు. కానీ బయట మాత్రం.. కేటుగాళ్లు సామాన్యులనే టార్గెట్ చేసి.. వారిని బురిడీ కొట్టిస్తారు. అన్ని రంగాల్లో ఈ తరహా మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా రైళ్లలో టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు తెర తీశారు కొందరు కేటుగాళ్లు. టికెట్ లేని ప్రయాణికులను టార్గెట్ చేసుకుని.. దోచుకోవడం ప్రారంభించారు. తాజాగా వీరి గుట్టురట్టయ్యింది. ఆ వివరాలు..

మెడలో నకిలీ రైల్వే ఐడీ కార్డు, ఫేక్ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్‌ కలెక్టర్‌లా మాట్లాడుతూ.. టికెట్‌ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు కొందరు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు వెళ్లే రైళ్లల్లో ప్రయాణాలు చేస్తూ.. టికెట్ లేని ప్రయాణికులనే టార్గెట్ చేస్తూ.. ఈ రకం దోపిడీలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. నిజమైన రైల్వే టీసీలుగా వ్యవహరిస్తూ.. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా చీరాలలో ఈ వ్యవహారం గుట్టురట్టయింది. దీనిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వలలో చిక్కిన నిరుద్యోగులు..

బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో అధికారులు.. నకిలీ టీటీఈలుగా చలామణి అవుతోన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురు యువకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి గణేష్, వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్‌ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి ప్రవీణ్‌.. ఈ ముగ్గురూ నిరుద్యోగుల. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. వీరికి బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. గణేష్, కళ్యాణ్, ప్రవీణ్ వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. ఆ తర్వాత వారికి నకిలీ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చి నకిలీ ఐడీ కార్డులు, జరిమానా పుస్తకాలు అందజేశాడు. అంతేకాకుండా వారిని ట్రైనింగ్ పేరు చెప్పి.. తనతో పాటే ఉంచుకుని విజయవాడ –నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో, ఎక్కడ ఎక్కాలో నిర్ణయించేవాడు. ఆ తర్వాత టికెట్‌ లేకుండా ప్రయాణించేవారికి భారీగా జరిమానాలు విధించి అధిక మొత్తంలో వసూలు చేసేవారు.

ట్రైనింగ్ పేరుతో మోసం..

రోజుకు కనీసం మూడు కేసులు రాయాలని చెప్పేవాడు సాయి ప్రసాద్. ఇదంతా నిజమే.. తాము రైల్వే నిజమైన రైల్వే ఉద్యోగులమని నమ్మిన ఆ యువకులు టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా విధిస్తూ ఆ డబ్బు తెచ్చి సాయి ప్రసాద్ కి అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం చీరాల రైల్వేస్టేషన్‌లో కేసులు రాస్తున్న గణేష్‌ను.. స్థానిక టీటీఈ రాజేష్‌ గమనించాడు. అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆయన రైల్వే పోలీసులకు చెప్పగా వారు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సదరు టీటీఈ ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన ఇద్దరిని కూడా జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన అసలు నిందితుడి సాయి కోసం గాలిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు నకిలీ టీసీలు ఉన్నారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ముగ్గురూ మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులు జారీ చేశారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి