iDreamPost

పిల్లాడిని చూసుకుంటుందని తిండిపెట్టి జీతమిస్తుంటే.. ఊహించని రీతిలో ఆయా అరాచకం

పిల్లాడిని చూసుకుంటుందని తిండిపెట్టి జీతమిస్తుంటే.. ఊహించని రీతిలో ఆయా అరాచకం

భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్తులు. రెండేళ్ల కుమారుడి ఆలనా పాలనా చూసుకునే తీరిక లేక.. ఒక పనిమనిషిని పెట్టుకున్నారు. భోజనం పెట్టి నెలకు ఐదువేలరూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పిల్లాడిని ఆయా చూసుకుంటుందన్న నమ్మకంతో ఇద్దరూ రోజూ తమ తమ డ్యూటీలకు వెళ్లొస్తున్నారు. అంతా ఓకే.. అనుకుంటున్న సమయంలో బాబులో వచ్చిన మార్పు తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది. ఆ చిన్నారి మౌన రోధన అందరిచే కంటతడి పెట్టుస్తోంది. పిల్లాడిని చూసుకునేందుకు పనిలోకి వచ్చిన ఆయా ఊహించని అరాచకానికి తెరతీసింది. తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లడం ఆలస్యం.. చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో అంతర్గత అవయవాలు వాచిపోయాయి. ఈ దారుణం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో చోటుచేసుకుంది.

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బాబులో.. ఉన్నట్లుండి మార్పు వచ్చింది. ఒకట్రెండు రోజులు మామూలే అనుకున్నారు కానీ.. ఆ తర్వాత మరింత నీరసించిపోయాడు. రోజూ అలాగే ఉండటంతో పిల్లాడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ బాబును పరీక్షించి.. ఆయన చెప్పింది విని షాకయ్యారు. పైకి మామూలుగానే కనిపిస్తున్న ఆ రెండేళ్ల బాలుడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఎందుకిలా జరుగుతుందో తెలియక.. వైద్యుడి సలహాతో ఇంటిలో సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. రెండ్రోజుల తర్వాత సీసీటీవీ రికార్డింగ్స్ చూసిన తల్లిదండ్రులు హతాశులయ్యారు.

పనిమనిషి రజని పిల్లాడిని చిత్రహింసలు పెడుతుండటం చూసి.. కంటతడి పెట్టుకున్నారు. అన్నం తినకున్నా, బాత్రూమ్ కి వెళ్లినా, చెప్పిన మాట వినకపోయినా, ఫోన్ వాడేటపుడు మధ్యలో విసిగించినా.. ఇలా అయినదానికి కాని దానికి పిల్లాడిని చితకబాదుతోంది. జుట్టుపట్టుకుని ఈడ్చటం, మెడపట్టి పైకి లేపడం, కడుపులో గుద్దడం వంటి తంతులు చేస్తోంది. తాము ఉన్నప్పుడు గారాబంగా చూసుకుంటున్నట్లు నటిస్తూనే.. ఇలా డ్యూటీలకు వెళ్లగానే చిన్నారిని హింసించడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనిమనిషి రజనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి పనిమనిషిని అరెస్ట్ చేశారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి