iDreamPost

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పేరుతో..

  • Published Aug 30, 2023 | 9:51 AMUpdated Aug 30, 2023 | 9:51 AM
  • Published Aug 30, 2023 | 9:51 AMUpdated Aug 30, 2023 | 9:51 AM
సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పేరుతో..

కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రోడ్‌ సైడ్‌ చిన్న చిన్న బళ్ల మీద వ్యాపారం చేసే వారు మొదలు.. మాల్స్‌ వరకు.. ఎక్కడ చూసిన డిజిటిల్‌ పేమెంట్స్‌ వ్యవస్థే నడుస్తోంది. ఇక గత 10 ఏళ్లతో పోల్చుకుంటే.. నేడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఆర్థిక వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరగాళ్లు కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సరికొత్త సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

కేటుగాళ్లు.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పేరుతో సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్ల నయామోసాలను తాజాగా బెంగళూరు పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ వ్యవహారంలో దాదాపు 21 మందితో కూడిన అంతర రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు. వివరాల్లోకెళ్తే..

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భాగంగా.. బడా ఈ కామర్స్‌ కంపెనీలు పలురకాల వస్తువులను అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు విక్రయిస్తుంటాయి. ఈ క్రమంలో వినియోగదారులకు సంబంధించిన డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పకూడదు అనే నిబంధన అమలులో ఉంది. అయితే ఆయా ఈ కామర్స్‌ కంపెనీల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు.. సైబర్ మోసగాళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని.. వినియోగదారులకు సంబంధించిన డేటాను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ-కామర్స్‌ కంపెనీల నుంచి సేకరించిన డేటాతో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్ల డేటాను సైబర్ మోసగాళ్లు వేరుపరుస్తారు. అనంతరం వారు ఆర్డర్‌ చేసిన వస్తువులకు బదులు నకిలీ వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేసి సొమ్ము కాజేస్తున్నారు.

నకిలీ వస్తువులు పంపుతూ..

ఇక ఈ మోసాల్లో భాగంగా.. కేటుగాళ్లు.. వినియోగదారులు ఆర్డర్‌ చేసిన వస్తువులను.. డెలివరీ తేదీ కన్నా ముందుగానే వారి అడ్రస్‌కు పంపిస్తున్నారు. ఇలా ముందుగా పంపే వాటిల్లో నకిలీ వస్తువులు ఉంచి.. వినియోగదారులకు ఏమాత్రం అనుమానం రాకుండా సొమ్ముచేసుకుంటున్నారు. తమకు డెలివరీ చేసిన వస్తువులు నకిలీవని గ్రహించిన వినియోగదారులు సంబంధిత ఈ-కామర్స్‌ కంపెనీలకు.. వాటిని రిటర్న్‌ చేసేవారు. ఫలితంగా ఆయా కంపెనీలు భారీ ఎత్తున నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ప్రతి ఏటా నకిలీ వస్తువుల వల్ల తమకు లక్షల్లో నష్టం వస్తుందని కంపెనీలు వాపోతున్నాయి. 2021 జూన్‌ నుంచి ఇప్పటి వరకు .. దాదాపు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని ఓ బడా కంపెనీ ఫిర్యాదు చేసయడంతో ఈ నయా మోసం వెలుగు చూసింది.

ఇలా చేధించారు..

ఫిర్యాదు అందుకున్న బెంగళూరు పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకుని.. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనగా కొరియర్‌ సబ్‌-షిప్పింగ్‌ కంపెనీ సమాచారం, నిందితులు కస్టమర్లకు పంపిన నకిలీ షిప్‌మెంట్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేవైసీ, బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఇలాంటి మోసాలతో ఈ సంబంధం ఉన్న.. ముంబయి, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 21 మందితో కూడిన అంతరాష్ట్ర మూఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 26.95 లక్షలు నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీసీ ప్రకాశ్‌ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి