iDreamPost

YSRCP Rajya Sabha Candidates 2022 వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు..నేపథ్యాలు

YSRCP Rajya Sabha Candidates 2022 వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు..నేపథ్యాలు

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో వెల్లడించారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ముందుగా ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అందరితో సంప్రదించిన తర్వాతే ఈ నలుగురి పేర్లను సీఎం జ‌గ‌న్ ఖరారు చేశార‌ని చెప్పారు. విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ అవ‌కాశం ద‌క్కింది. జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు బొత్స చెప్పారు.

నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలే. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్‌ పోస్టులైనా వైఎస్సార్‌సీపీది ఒకేటే దారి, జనాభాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నాం. రాజ్యసభకి తెలంగాణ, ఆంధ్ర అనేది ఉండదు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్.కృష్ణయ్యకి ఇచ్చారు. నిరంజన్ రెడ్డి సీనియ‌ర్ సుప్రీంకోర్టు న్యాయవాది అని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు..నేపథ్యాలు

ఆర్‌ కృష్ణయ్య

బీసీ సంఘ ఉద్యమ నేతగా దేశం మొత్తానికి తెలిసిన నేత‌. పుట్టింది సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో. బాగా చ‌దువుకున్నారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు లా చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.

స్టూడెంట్ గానే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాచేశారు. రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటైతే, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

2014లో ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాని 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు.

బీద మస్తాన్‌రావు

1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో పుట్టిన బీద మ‌స్తాన్ రావు, బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది.
చెన్నైలో ఫేమ‌స్ హోటల్‌ గ్రూప్‌నకు ఫైనాన్షియల్‌ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు, ఆ త‌ర్వాత ఆక్వా రంగంలో విదేశాల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు.

బోగోల్‌ మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న బీసీ సంక్షేమం కోసం పాటుప‌డ్డారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు.

2019లో నెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోటీ చేసిన బీద మ‌స్తాన్ రావు, 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు.


విజయసాయి రెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.
పుట్టింది 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడిలో. చెన్నైలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేసిన విజయసాయిరెడ్డి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై, 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. మ‌రోసారి ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ద‌క్కింది.

రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). రూల్స్‌, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా చురుకుగా పని చేశారు.

నిరంజన్‌ రెడ్డి

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. జులై 22 1970న పుట్టారు. అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణం ఆయ‌న స్వ‌స్థ‌లం.హైదరాబాద్‌లో చ‌దువుకొని, పుణెలోని సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.

రాజ్యాంగపరమైన అంశాలతోపాటు, చట్టాలపై పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక కేసులు వాదించారు నిరంజన్‌ రెడ్డి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి