iDreamPost

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ కేసు : సీబీఐ విచారణపై హైకోర్టు అసంతృప్తి

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ కేసు : సీబీఐ విచారణపై హైకోర్టు అసంతృప్తి

విశాఖపట్నం ప్రభుత్వ వైద్యశాల మత్తు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుధాకర్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ తన విచారణను పూర్తి చేసి హైకోర్టుకు నివేదికను అందజేసింది. దీనిపై ఈ రోజు విచారణ చేసిన ఏపీ హైకోర్టు… సీబీఐ అందజేసిన విచారణ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వ లోపు మళ్లీ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసును పర్యవేక్షించేందుకు అడిషనల్‌ డైరెక్టర్‌స్థాయి అధికారిని నియమించాలని సీబీఐకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ తొలి వారానికి వాయిదా వేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలో తమకు మాస్క్‌లు ఇవ్వలేని మత్తు డాక్టర్‌ బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. క్రమశిక్షణా చర్యల కింద ఆయన్ను అధికారులు సస్పెండ్‌ చేశారు. అనంతరం మత్తు డాక్టర్‌సుధాకర్‌ రాజకీయ కోణంలో ఆరోపణలు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి మరీ మంతనాలు జరిపారు. రోడ్డు పక్కన కారు ఆపి ప్రధాని, ముఖ్యమంత్రిని దూషించారు. రోడ్డుపై న్యూసెన్స్‌ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. కరోనా సమయంలో వారిపై ఉమ్మివేస్తూ హల్‌చల్‌ చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు, ఆ తర్వాత మానసిక పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తరలించారు.

అయితే పోలీసులు డాక్టర్‌ను తీసుకొచ్చే సమయంలో దురుసుగా ప్రవర్తించారని, అతనిపై చేయి చేసుకున్నారని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం.. స్థానిక పోలీసులు సరిగా దర్యాప్తు చేయడంలేదంటూ.. విచారణను సీబీఐకి అప్పగించింది. తాజాగా సీబీఐ విచారణపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. మరింత లోతుగా సీబీఐ అడిషన్‌ డైరెక్టర్‌స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Aslo : బాబు ఇచ్చిన స్ఫూర్తి.. ఒట్టు వేయాలంటూ మంత్రికి టీడీపీ ఎమ్మెల్సీ సవాల్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి