iDreamPost

నిమ్మగడ్డ దూకుడుకు హైకోర్టులో బ్రేక్‌

నిమ్మగడ్డ దూకుడుకు హైకోర్టులో బ్రేక్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడుకు ఏపీ హైకోర్టులో బ్రేక్‌ పడింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ఈ నెల 8వ తేదీన ఎస్‌ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌న్‌ హైకోర్టు నిలిపివేసింది. ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు విచారించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు రెండు గంటల పాటు వాదనలు విన్న తర్వాత హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ వాదన వైపు మొగ్గుచూపింది. కరోనా సమయంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు తీర్పు వెలువరించంది. వ్యాక్సినేషన్‌కు ఆటకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 14, 21లను ఉల్లంఘించినట్లుగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపడితే మంచిదని హైకోర్టు పేర్కొంది.

గత మార్చిలో ముమ్మురంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అర్థంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామలతో ఎస్‌ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం బాగా పెరిగింది. ఎన్నికల సంస్కరణలతో ఎస్‌ఈసీ పదవిని నిమ్మగడ్డ కోల్పోయారు. ఆ సమయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. చంద్రబాబు సన్నిహితులు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ రాజకీయ కోణంలో పని చేస్తున్నారంటూ.. అప్పటి వరకు వైసీపీ నేతలు చేసిన విమర్శలకు ఈ పరిణామం బలం చేకూర్చింది.

కోర్టుకు వెళ్లి మళ్లీ పదవి నిలుపుకున్న తర్వాత నిమ్మగడ్డ పూర్తిగా రాజకీయ కోణంలో పని చేయడం ఆరభించినట్లు ఆయన తీరుతో స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానంటూ గత నవంబర్‌లో ప్రకటించారు. కరోనాను కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. మళ్లీ కరోనా వ్యాప్తి సమయంలోనే ఎన్నికలు జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేశారు. ఎన్నికల నియమావళి పేరుతో పథకాలు ఆపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి విమర్శలపాలయ్యారు. తాజాగా నిమ్మగడ్డ తీరును హైకోర్టు కూడా తప్పుబట్టడం గమనార్హం. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి