iDreamPost

పాడి రైతులకు జగన్‌ అండ.. పాల సేకరణకు ముహూర్తం ఖరారు

పాడి రైతులకు జగన్‌ అండ.. పాల సేకరణకు ముహూర్తం ఖరారు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు జోడు చక్రాల వంటి వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆ దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వ్యవసాయంలో అన్నదాతలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న జగన్‌ సర్కార్‌.. తాజాగా పాడి పరిశ్రమపై దృష్టి సారించింది.

రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, పాలక మండళ్ల అవినీతి కారణంగా నిర్వీర్యమైన సహకార డైరీలను తిరిగి ప్రారంభించేందుకు జగన్‌ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత అమూల్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.. సహకార డైరీలను తిరిగి పునర్ధురించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.

గ్రామాల్లోనే కూలింగ్‌ యూనిట్లు…

రాష్ట్రంలో 9,889 గ్రామాల్లో పశుపోషణ ఎక్కువగా ఉందని అమూల్‌ ప్రతినిధులు గుర్తించారు. పాల సేకరణ కేంద్రాలతోపాటు బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు కూడా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 1000 – 2000 లీటర్ల సామర్థ్యం గల బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు 5,386. 3–5 వేల లీటర్ల సామర్థ్యం గల యూనిట్లు 674 రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని అమూల్‌ ప్రతిపాదించింది. ఇందు కోసం 888 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. వాటికి సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యాయి.

నవంబర్‌లో శ్రీకారం..

బల్క్‌ కూలింగ్‌ మిషన్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి పాల సేకరణ ప్రారంభించాలని సీఎం జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తన అభిమతాన్ని అమూల్‌ సంస్థ ప్రతినిధులకు వెల్లడించారు. సీఎం జగన్‌ లక్ష్యానికి అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాలలో బల్క్‌ కూలింగ్‌ మిషన్ల ఏర్పాటును అమూల్‌ వేగవంతం చేసింది. నవంబర్‌ నెలాఖరుకు నాటికి కొన్ని యూనిట్లను సిద్ధం చేయాలని పని చేస్తోంది. నవంబర్‌ 25వ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సహకార డైరీల ద్వారా పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో దిశానిర్ధేశం చేశారు. 

రైతు కష్టం రైతుకే..

సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు మంచి ధర లభించేలా చర్యలు చేపడతామని సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మార్కెట్‌లోని కంపెనీలు ఇచ్చే ధర కన్నా.. సహకార సంఘాలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయలు ప్రొత్సహకం కింద అందిస్తామని హామీ ఇచ్చారు. పాల సేకరణ ప్రారంభం అయిన తర్వాత రైతులకు నాలుగు రూపాయల పొత్రాహకం అందనుంది.

ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయల ప్రొత్సాహకం వల్ల ప్రైవేటు డైరీలు కూడా ఎక్కువ ధరను రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా కంపెనీల మధ్య పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించనుది. ప్రస్తుతం రైతుల వద్ద కొనుగోలు చేసే పాల ధరకు.. వాటిని ప్యాకింగ్‌ చేసి వినియోగదారులకు అమ్మే ధరకు మ«ధ్య వ్యాత్యాసం భారీగానే ఉంది. ఈ వ్యత్యాసం సొమ్ము అంతా కంపెనీలకు ఆదాయం రూపంలో వెళుతోంది. అమూల్‌ పర్యవేక్షణలో సహకార డైరీలు పని ప్రారంభిస్తే.. రైతుల కష్టం రైతులకే చెందుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి