iDreamPost

జగన్‌ సర్కార్‌ మహిళా దినోత్సవ కానుక.. బాలికల కోసం సరికొత్త పథకం..

జగన్‌ సర్కార్‌ మహిళా దినోత్సవ కానుక.. బాలికల కోసం సరికొత్త పథకం..

ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టినా, విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓట్ల కోసమేనన్నది నిన్నమొన్నటి వరకు కనిపించిన పరిస్థితి. ఓటు హక్కు ఉన్న వయోజనులకు సంబంధించి మాత్రమే ఆయా ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర భారతదేశంలో ఉంది. ఈ చరిత్రను తిరగరాసేలా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజల మౌలిక అవసరాలు తీర్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పేద, దిగువ మధ్యతరగతి పిల్లల విద్య, ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న నిర్ణయాల ద్వారా స్పష్టమవుతోంది.

తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాన్ని ప్రకటించారు. పిల్లలకు మేనమామలా ఉంటానని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆ మాటను మరోమారు నిరూపించుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యనభ్యసించే విద్యార్థినిల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినిలకు న్యాప్‌కిన్లు అందించాలని నిర్ణయించారు. నెలకు పది న్యాప్‌కిన్లను ప్రతి విద్యార్థినికి అందించే పథకాన్ని ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రఖ్యాత కంపెనీలకు చెందిన న్యాప్‌కిన్లను విద్యార్థులకు అందించనున్నారు.

టెండర్ల ద్వారా న్యాప్‌కిన్లను కొనుగోలు చేసి పంపిణీ చేసే బాధ్యతను మెప్మా, సెర్ఫ్‌ సంస్థలకు సీఎం వైఎస్‌ జగన్‌ అప్పగించారు. మే నాటికి టెండర్లు ఖారరు చేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి పంపిణీ చేయాలని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాబోయే జూన్‌ నెల నుంచి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాలలో చదువుకునే 7 నుంచి 12వ తరగతి విద్యార్థినికుల నెలకు 10 చొప్పన ఏడాదికి 120 న్యాప్‌కిన్లను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఉచితంగా అందించబోతోంది. ఈ పథకం కోసం 41.40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

విద్యార్థుల కోసం ఇప్పటికే సీఎం వైఎస్‌జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు అందిస్తున్నారు. మన బడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పింస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి బ్యాగ్, మూడు జతల యూనిఫాం, షూ, షాక్స్‌లు, బెల్ట్, టెక్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్‌ అందించారు. మధ్యాహ్నం భోజనం మెనూలో సమూల మార్పులు చేసి ప్రతి రోజు విభిన్నమైన కూరలతో భోజనం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినీ విద్యార్థులు అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు బదులు ల్యాప్‌ట్యాప్‌లను తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీస్‌ మీడియంలో విద్యా బోధన చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు ధనికవర్గాల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్‌ఈ సిలబస్‌ను పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు కాబోతోంది. పిల్లలకు మేలు చేసే కార్యక్రమాలు, పథకాలలో తాజాగా ఉచిత న్యాప్‌కిన్ల పంపిణీ పథకం చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి