iDreamPost

AP వాలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ.1500.. ఎందుకంటే

  • Published Mar 06, 2024 | 9:24 AMUpdated Mar 06, 2024 | 10:27 AM

ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. వారు ఒక్కొక్కరికి రూ.1500 ఇవ్వనుంది. ఎందుకు.. ఎవరికి ఇస్తుంది అంటే..

ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. వారు ఒక్కొక్కరికి రూ.1500 ఇవ్వనుంది. ఎందుకు.. ఎవరికి ఇస్తుంది అంటే..

  • Published Mar 06, 2024 | 9:24 AMUpdated Mar 06, 2024 | 10:27 AM
AP వాలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ.1500.. ఎందుకంటే

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు వారు అభివృద్ధి చెంది.. ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని భావించి.. వారి కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా.. పథకాలు అన్ని లబ్ధిదారులకే చేరేలా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేయడం కోసం వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు సీఎం జగన్‌. వారు అందిస్తోన్న సేవలు అమోఘం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు వాలంటీర్లు. ఇక మొన్నటి వరకు వాలంటీర్ల మీద నానా ఆరోపణలు చేసిన చంద్రబాబు సైతం.. తాజాగా మాట మార్చి.. వాలంటీర్‌ వ్యవస్థ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో తాజాగా జగన్‌ సర్కార్‌ వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

ప్రజలకు ఎంతో సేవ చేస్తోన్న వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారు ఒక్కొక్కరికి రూ.1500 ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రజల ఇళ్ల దగ్గరకే రేషన్‌ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్లకు జగన్‌ సర్కార్‌ ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే గత మూడు నెలలకు సంబంధించి అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది జగన్‌ ప్రభుత్వం. రేషన్‌ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్‌ ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలకు కలిపి మొత్తం రూ.1,500 అందజేస్తారు.

ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఇళ్ల దగ్గరకే మొబైల్‌ ఆటోల ద్వారా రేషన్‌ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్లకు నెలకు రూ.500 చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు సిద్ధం అయ్యింది.

ప్రభుత్వ సేవలను ఇంటింటికీ చేరవేసేందుకు.. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక వారికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని అందిస్తోంది జగన్‌ సర్కార్‌. ఇందుకోసం ప్రతి నెలా ఖజానా నుంచి రూ.392 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వమే తెలిపింది. తాజాగా ఎండీయూ వాహనాల వెంట ఉంటున్నందుకు గాను వాలంటీర్లకు నెలకు రూ.500 అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

వాస్తవంగా ఎండీయూ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచే వాటి ద్వారా రేషన్‌ సరుకులను ఇంటింటికీ సక్రమంగా అందించేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వాలంటీర్లకే అప్పగించింది. పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సేవలలో వాలంటీర్లు బిజీ అయిపోయారు. ఇప్పుడు రేషన్ పంపిణీ బాధ్యత కూడా వారికే అప్పగించారు. అందుకే ప్రభుత్వం వారికి నెలకు రూ.500 చెల్లిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి