iDreamPost

మణిపూర్ లో మరో అమానుష ఘటన.. వివాహితపై అత్యాచారం!

  • Author Soma Sekhar Published - 05:34 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 05:34 PM, Thu - 10 August 23
మణిపూర్ లో మరో అమానుష ఘటన.. వివాహితపై అత్యాచారం!

గత మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. కుకీ, మైతి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా హింసాకాండలు చెలరేగాయి. ఈ దాడుల్లో మహిళలు బలిపశువులుగా మారుతున్నారు. ఎందరో మహిళలను తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశం మెుత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక మణిపూర్ లో జరిగిన ఒక్కొక్క దారుణాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రెండు తెగల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో మహిళలు బలిపశువుగా మారుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేంగించిన సంఘటన మరచిపోక ముందే.. మరికొన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మణిపూర్ లో మరో అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 3న కొండప్రాంత జిల్లా అయిన చురాచంద్ పూర్ లో గుర్తు తెలియని కొందరు దుండగులు 37 ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు తాజాగా బిష్ణుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణిపూర్ లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో బాధితురాలి ఇంటికి నిప్పంటించారు కొందరు దుండగులు. దాంతో ఆమె తన ఇద్దరు పిల్లలు, ఆడపడుచు, మేనకోడలితో కలిసి పారిపోతుండగా.. ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ గౌరవం, సాంఘిక బహిష్కరణకు గురికాకుండా ఉండేందుకే ఈ దారుణాన్ని బయటపెట్టలేదని బాధితురాలు తెలిపింది. కాగా.. ఆమె ఆరోగ్యం క్షీణించిందని దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఇంఫాల్ లోని రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వెళ్లిన బాధితురాలు డాక్టర్లకు విషయం చెప్పడానికి సంకోచించి వారిని కలవకుండానే వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. కానీ పరిస్థితి విషమించడంతో.. మంగళవారం ఇంఫాల్ లోని జేఎన్ఐఎంఎస్ హాస్పిటల్ కు ఆమె వెళ్లగా.. అక్కడి వైద్యులు చికిత్స చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసేలా ధైర్యం చెప్పి పంపించారని బాధితురాలు తెలిపింది. ఇప్పటికే ఎన్నో అమానుషమైన ఘటనలు మణిపూర్ లో జరిగాయి. వీటిపై దేశం మెుత్తం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ ఘటనలు ఆగడం లేదు.

ఇదికూడా చదవండి: వీడియో: యువతిపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి