iDreamPost

సాగర్ ఎన్నిక ప్రచారానికి ఓ లెక్కుంది..

సాగర్ ఎన్నిక ప్రచారానికి ఓ లెక్కుంది..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కుతూనే ఉన్నాయి. ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే దానికి దీటుగా మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు మాత్రం ప్రచారం చేయకపోవడం ఇక్కడ కొసమెరుపు. దీని వెనక కూడా రాజకీయ వ్యూహంలో గమనార్హం.

ఈనెల 17న సాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. 15 సాయంత్రానికే ఎన్నిక‌ల ప్రచారం ముగియ‌నుంది. అంటే స‌రిగ్గా ప‌ది రోజుల గ‌డువు కూడా లేదు. రాజ‌కీయ పార్టీల అగ్రనేత‌లు సాగ‌ర్ వైపు చూడ‌టం లేదు. ప్రధాన రాజ‌కీయ పార్టీలైన టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపితోపాటు 41 మంది సాగ‌ర్ బ‌రిలో ఉన్నారు. ఇప్పటిదాకా ప్రచారం హీటెక్కలేదు. ఇటు టిఆర్ ఎస్ నుంచి గానీ అటు బిజెపి నుంచి గానీ అగ్రనేత‌లు ఎవ‌రూ ప్రచారానికి వెళ్లడం లేదు.

టిఆర్ఎస్ నాగార్జున‌సాగ‌ర్‌లో మండ‌లానికో ఎమ్మెల్యేను ఇన్‌‌ఛార్జ్‌ను నియ‌మించింది. మంత్రులు త‌ల‌సాని, మ‌హ‌మూద‌్ అలీ, స్థానిక మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మాత్రమే ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నారు. ఇటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, అధ్యక్షుడు కేసియార్ గానీ సాగ‌ర్ ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదు. కేవ‌లం రెండు రోజుల‌పాటు మాత్రమే కేటీఆర్ రోడ్ షో కోసం టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్రచారం ముగియ‌డానికి ముందురోజు 14న కేసియార్ బ‌హిరంగ‌స‌భ నిర్వహించే ఆలోచ‌న‌లో ఉన్నారు.

Also Read : నాగార్జునసాగర్‌ : బీజేపీ జోరు తగ్గిందా?

బిజెపి అగ్రనేత‌లు కూడా సాగ‌ర్ వైపు వెళ్లడం లేదు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి గానీ, పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ గానీ ప్రచారానికి ఇంకా వెళ్లలేదు.అలాగే కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఠాగూర్ , పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భ‌ట్టి పూర్తిస్థాయి క్యాంపెయిన్ చేయ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు సాగ‌ర్‌లో క‌నిపించి వ‌చ్చేస్తున్నారు.

సాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక ప్రచారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం గట్టి నిఘా పెట్టింది. రాజ‌‌కీయ పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మార‌డంతో అంద‌రి దృష్టి ఈ ఎన్నిక‌పైనే ఉంది. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్రకారం అభ్యర్థి 28 ల‌క్షలు ఖ‌ర్చు పెట్టొచ్చు. అంత‌కు మించి అధికారికంగా ఖ‌ర్చు చేస్తే చిక్కుల్లో ప‌డ్డట్టే.

పార్టీ అగ్రనేత‌లు అభ్యర్థి త‌ర‌పున చేసే ప్రచారం, అడ్వర్టైజ్ మెంట్లు, ఎన్నిక‌ల స‌భ‌ల ఖ‌ర్చు అంతా కూడా అభ్యర్థి అకౌంట్‌లోనే లెక్కిస్తారు. అగ్రనేత‌లు ప్రచారానికి వ‌స్తే మామాలు హ‌డావిడి ఉండ‌దు. వాహ‌నాలు, ప్రచార సామ‌గ్రి ఖ‌ర్చు అంతా అందులోనే క‌లిపేస్తారు. ఏ రోజు ఎంత ఖ‌ర్చు చేస్తున్నార‌న్న వివ‌రాలు కూడా ఎన్నిక‌ల అధికారుల‌కు స‌మ‌ర్పించాలి. దీనికి తోడు స్వతంత్ర్యంగా కూడా ఈసీ ఎన్నిక‌ల ఖ‌ర్చు అంచ‌నావేసేందుకు అధికారుల‌ను నియ‌మించుకుంటుంది. ఈ భ‌యంతోనే ఎక్కువ‌మంది నేత‌ల‌ను, పెద్ద నేత‌ల‌ను ప్రచారానికి రాకుండా దూరంగా ఉంచారు. లెక్కల‌న్నీ స‌రిచూసుక‌న్నాకే అగ్రనేత‌లు ప్రచారానికి వెళ్లనున్నారు.

Also Read : కుల సమరంగా సాగర్ సమరం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి