iDreamPost

దేశం తరఫున ఆడటానికి గాయాలు అడ్డు! కానీ.. IPLకి అందరూ రెడీ!

  • Published Mar 20, 2024 | 5:18 PMUpdated Mar 20, 2024 | 5:19 PM

IPL 2024, Hardik Pandya: ఐపీఎల్‌ 2024 సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌ కోసం నిన్నమొన్నటి వరకు గాయాలంటూ మూలన కూర్చున్న టీమిండియా ఆటగాళ్లు కూడా ఉరకలేసే ఉత్సాహంతో రెడీ అయ్యారు. ఇలా ఎలా సాధ్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, Hardik Pandya: ఐపీఎల్‌ 2024 సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌ కోసం నిన్నమొన్నటి వరకు గాయాలంటూ మూలన కూర్చున్న టీమిండియా ఆటగాళ్లు కూడా ఉరకలేసే ఉత్సాహంతో రెడీ అయ్యారు. ఇలా ఎలా సాధ్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 5:18 PMUpdated Mar 20, 2024 | 5:19 PM
దేశం తరఫున ఆడటానికి గాయాలు అడ్డు! కానీ.. IPLకి అందరూ రెడీ!

ఇప్పటికే క్రికెట్‌ అభిమానులకు ఐపీఎల్‌ ఫీవర్‌ ఎక్కేసింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు షురూ అవుతాయా అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శుక్రవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే అన్ని టీమ్స్‌ కూడా ఐపీఎల్‌ కోసం రెడీగా ఉన్నాయి. తమ తమ ప్రణాళికలతో గ్రౌండ్‌లోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. అయితే.. ఐపీఎల్‌ కంటే ముందు గాయాలతో తెగ ఇబ్బంది పడ్డ కొంతమంది ఆటగాళ్లు ఇప్పుడు కుందేళ్లలా చెంగుచెంగున దూకుతున్నారు.

హార్ధిక్‌ పాండ్యా.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ మధ్యలో గాయపడ్డాడు. మళ్లీ తిరిగి టీమిండియాలోకి రాలేదు. వచ్చేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. నేరుగా ఇప్పుడు ఐపీఎల్‌ బరిలోకి దిగుతున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన తర్వాత పూర్తిగా రెస్ట్‌ తీసుకున్న పాండ్యా.. ఐపీఎల్‌ వస్తుందనగానే బరోడా క్రికెట్‌ గ్రౌండ్‌లో తెగ ప్రాక్టీస్‌ చేసి ఫిట్‌నెస్‌ సాధించి.. ఐపీఎల్‌కి ఫుల్‌ ఫిట్‌గా రెడీ అయిపోయాడు. కేఎల్‌ రాహుల్‌.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ ఆడిన రాహుల్‌.. గాయంతో మొత్తం టోర్నికి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నించకుండా ఐపీఎల్‌ కోసం రెస్ట్‌ తీసుకోని ఇప్పుడు లేడీ పిల్లలా దూకుతున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు.

Why IPL players not injured while season

కేఎల్‌ రాహుల్‌ ఇండియన్‌ టెస్ట్‌ టీమ్‌లో ఎంతో కీలకమైన ప్లేయర్‌, అయినా కూడా అతను దేశం కోసం ఆలోచించలేదు. రోహిత్‌ కెప్టెన్సీలో జైస్వాల్‌, గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌ లాంటి యంగ్‌ ప్లేయర్లు రాణించడంతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోగలిగింది. అదే వాళ్లు తడబడి ఉంటే.. ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. అలాగే జడేజా సైతం ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. బుమ్రా కూడా ఇంగ్లండ్‌తో ఒక మ్యాచ్‌ ఆడలేదు. ఇలా ఆటగాళ్లు దేశానికి ఆడే సమయంలో గాయాలు, రెస్ట్‌లంటూ కథలు చెబుతారని, ఐపీఎల్‌ అనగానే ఎక్కడలేని ఉత్సాహంతో పరుగులు పెడుతుంటారని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.

అయితే.. ఆటలో ప్లేయర్లు గాయపడటం సహజమే. అందులో వారిని తప్పుబట్టలేం. కానీ, గాయపడ్డాక దాని నుంచి కోలుకుని తిరిగి టీమ్‌లోకి వచ్చి దేశానికి ఆడేందుకు ఎంత మంది నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ కాలం క్రికెటర్లకు డబ్బే పరమావధి అయిపోయిందనే వాదన కూడా ఉంది. దాన్ని కొంతమంది క్రికెటర్లు నిజం చేస్తున్నారు కూడా. ఇషాన్‌ కిషన్‌ లాంటి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువ ఆటగాడు సైతం.. ఇండియా తరఫున ఆడకుండా పార్టీలకు, షోలకు వెళ్లాడు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ ఆడాల్సిందిగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరితే.. నిరాకరించి ఐపీఎల్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. అంటే అతనికి దేశానికి ఆడటం కంటే డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్‌లో ఆడటమే ఇష్టం అన్నట్లు ఉంది పరిస్థితి. ఇలాంటి ధోరణి ఎంత దారుణాలకు దారి తీస్తుందో ఊహించలేం.

ఇండియన్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌లో తప్ప మరే లీగ్‌లో కూడా ఆడే అవకాశం బీసీసీఐ ఇవ్వడం లేదు. లేదంటే.. టీమిండియాకు పూర్తిగా దూరంగా ఉంటూ.. ఆ వెస్టిండీస్‌ క్రికెటర్లలా కేవలం ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ మాత్రమే ఆడుతూ డబ్బు వెనుక పడేవారు. అప్పుడు టీమిండియా కూడా మరో వెస్టిండీస్‌లా, పసికూన టీమ్‌లా మారిపోయేది. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన బీసీసీఐ.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ టీ20 లీగ్స్‌లో భారత క్రికెటర్లు ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే.. ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఇచ్చిన ప్రాధాన్యత టీమిండియాకు ఇవ్వడం లేదనేది స్పష్టం. ఐపీఎల్‌ ఆడొద్దని, డబ్బు సంపాదించొద్దని ఏ క్రికెటర్‌ను ఎవరూ కోరడం లేదు.. కానీ, ఐపీఎల్‌ సీజన్‌ మరో నెల రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగానే.. గాయాలంటూ రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లిపోయిన వారంతా.. ఫిట్‌నెస్‌ కోసం చెమటలు చిందిస్తున్నట్లే దేశం కోసం చిందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి