iDreamPost

పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌..

పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌..

దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే 90 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల కథ మళ్లీ మొదటికొస్తోన్నట్టే కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఫోర్త్ వేవ్‌కు దారితీసే ప్రమాదం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. అటు చైనా షాంఘైలో కోవిడ్ వల్ల మరణాలు సైతం సంభవిస్తోండటం ఆందోళనకు దారి తీస్తోంది. మాస్క్‌లను ధరించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,985 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 214 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా నమోదైంది. చెప్పుకోవడానికి 2,183 కొత్త కేసులే రికార్డయినప్పటికీ- పెరుగుదల తీవ్రతకు అది అద్దం పడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం నాటితో పోల్చుకుంటే కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి.

ఈ పరిణామాల మధ్య కొత్తగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పుట్టుకొచ్చింది. త్రిపురలో విస్తరించింది. సెపహిజల జిల్లాలోని దేవీపూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తోన్న పిగ్ బ్రీడింగ్ ఫామ్‌లో ఈ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. కొన్ని పందుల నమూనాలను పరీక్షించిన అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్ధారించారు. తొలిదశలో మూడు పందుల్లో ఫీవర్ లక్షణాలు కనిపించాయని, మిగిలిన వాటికి కూడా సోకి ఉంటాయని అంచనా వేసినట్లు చెప్పారు.

పందుల నుంచి మనుషులకు విస్తరించే ప్రమాదం ఉన్నందున- బ్రీడింగ్ ఫామ్‌లో పని చేసే సిబ్బంది, కార్మికులకు పీసీఆర్ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వ లాబొరేటరీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ మృనాల్ దత్త తెలిపారు. స్వైన్ ఫీవర్ బారిన పడిన పందులన్నింటినీ సామూహికంగా ఖననం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. బ్రీడింగ్ ఫామ్‌కు చదరపు కిలోమీటర్ పరిధిలో ఉన్న పందులన్నింటినీ ఖననం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

కరోనా వైరస్‌కు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) స్పష్టం చేసినప్పటికీ అప్రమత్తంగా ఉండక తప్పదని మృనాల్ దత్త చెప్పారు. ఫీవర్ బారిన పడిన పందులన్నీ మరణించాయని, వాటిని సంరక్షించడానికి అసవరమైన వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని అన్నారు. దీన్ని విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి