iDreamPost

దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే!

దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే!

తల్లిదండ్రులు తమ పిల్లలను తమకన్నా గొప్ప పొజీషన్లో ఉండాలని కోరుకుంటారు. అందుకు చిన్ననాటి నుంచి చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక పిల్లలు పెద్దయ్యాక వారి ఉద్యోగం, పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ ఇంటి ఆడపిల్లను గొప్పింటి వారికి ఇచ్చి వివాహం జరిపించాలనే చూస్తుంటారు. ఇటీవల యువత ఎక్కువగా తల్లిదండ్రులను కాదనుకొని కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో కొంతమంది తల్లిదండ్రులు ఆగ్రహించి పిల్లలను చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వివాహాలు వివాదాస్పదంగా, ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే తన కూతురు పెళ్లవిషయంలో ఆదర్శంగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కూతురు ప్రేమించిన యువకుడిని ఇచ్చి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. రాచమల్లు శివప్రసాద్ పెద్ద కూతురు పల్లవిని కే లీలా గోపి పవన్ కుమార్ కి ఇచ్చి నిరాడంబరంగా, సంప్రదాయబద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద సమక్షంలో పెళ్లి జరిపించారు. తర్వాత ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆస్తులు, కులాలు అనేవి చూడకుండా ఆదర్శవంతమైన నిర్వణయం తీసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను మొదటి నుంచి అన్ని మతాలు.. అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తూ వచ్చాను. అందుకే నా కూతురు ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ఈ కాలంలో యువత అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం పెద్దల బాధ్యత. నా కూతురు ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకొని నిండు మనసుతో ఆశీర్వదించాను. అబ్బాయి పేదవాడైనా.. నా కూతురు కలిసి చదువుకునే రోజుల నుంచి ఇద్దరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారని.. డబ్బు, హూదా, కులానికి విలువ ఇవ్వకుండా వారికి పెళ్లి జరిపించాను’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి