iDreamPost

యంగ్ టైగర్ కింగ్ ల పోటాపోటీ హంగామా

యంగ్ టైగర్ కింగ్ ల పోటాపోటీ హంగామా

మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై పెద్ద సందడి మొదలుకానుంది. జెమిని ఛానల్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ నెల 22న ప్రారంభించంబోతున్నారు. మొదటి లాంచింగ్ ఎపిసోడ్ కు రామ్ చరణ్ రానుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్విజ్ లో 25 లక్షలు ప్రైజ్ కూడా గెలుచుకుని ఆల్రెడీ దాన్ని చారిటీకి ఇచ్చేశాడన్న టాక్ ఇప్పటికే లీకైన సోర్స్ ద్వారా తెలిసింది. సోమవారం నుంచి రెగ్యులర్ కంటెస్టెంట్స్ తో సిరీస్ కంటిన్యూ అవుతుంది. నెల రోజులకు పైగా సరిపడా షూట్ ని పూర్తి చేశారని తెలిసింది. ఆర్ఆర్ఆర్ కోసం ఉక్రెయిన్ కు వెళ్లకముందే తారక్ ఏకధాటిగా దీని షూట్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాతే బ్రేక్ తీసుకున్నాడు.

ప్రాధమికంగా ఉన్న సమాచారం మేరకు రెమ్యునరేషన్ కూడా భారీగా ముట్టజెప్పారని ఇన్ సైడ్ న్యూస్. దీని సంగతలా ఉంచితే ఈ షో రిలీజ్ డేట్ ప్రోమో వచ్చిన రోజే బిగ్ బాస్ 5 తాలూకు పబ్లిసిటీ కూడా స్టార్ మా మొదలుపెట్టింది. రేటింగ్స్ పరంగా ఈ రెండిటి మధ్య విపరీతమైన పోటీ ఉండబోతోందనే అంచనాలు ఉన్నాయి. బిగ్ బాస్ 5లో ఉంటారా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ నాగార్జున స్వయంగా యాడ్ లో నటించడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ని ఎంపిక చేసి పెట్టారట. సోషల్ మీడియా సెలబ్రిటీస్ కూడా ఇందులో భాగం కాబోతున్నారని వినికిడి. పూర్తి లిస్టు త్వరలోనే లీక్ కావొచ్చు,

సినిమాలతోనే కాకుండా ఇలాంటి రియాలిటీ షోల ద్వారా కూడా ఛానల్స్ పెద్ద యుద్ధానికి తెర తీస్తున్నాయి. టిఆర్పి రేటింగ్ రాను రాను పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ఓటిటి పోటీని తట్టుకుని కొనసాగడం వాటికి సవాల్ గా మారింది. అందుకే స్టార్లు అడిగినంత రెమ్యునరేషన్లు ఇచ్చి మరీ వీటికి లాక్ చేసుకుంటున్నారు. తమన్నా హోస్ట్ చేస్తున్న మాస్టర్ చెఫ్ ని ఈ నెల 28 నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ అట్రాక్షన్లతో కొత్త కళ సంతరించుకుంటున్న ఈ ప్రోగ్రాంలు పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేకూర్చేలా రేటింగ్ ని ఆదాయాన్ని ఏ మేరకు తెస్తాయో చూడాలి. తారలు కూడా మొహమాటపడకుండా వీటికి ఎస్ చెప్పడం విశేషం

Also Read : కంటెంట్ మాట్లాడితేనే సినిమాకు అందం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి