iDreamPost

అగ్ర రాజ్యాధిపతి చేత ప్రపంచ అతిపెద్ద క్రికెట్ మైదానంను ప్రారంభించిన భారత్

అగ్ర రాజ్యాధిపతి చేత ప్రపంచ అతిపెద్ద క్రికెట్ మైదానంను ప్రారంభించిన భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం అయినా గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (మొతెరా) స్టేడియంను భారత ప్రధాని మోడీ తో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు.అనంతరం ఈ స్టేడియంలో ఏర్పాటు చేసిన “న‌మ‌స్తే ట్రంప్” కార్య‌క్ర‌మానికి అమెరికా అధ్య‌క్షుడు త‌న కుటుంబ సభ్యులతో కలిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ట్రంప్‌ ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి,బాలీవుడ్,క్రికెట్ వంటి వివిధ అంశాలను ప్రస్తావించారు.ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్‌బాల్‌ మైదానంలో తాము భారత ప్రధాని నరేంద్రమోదీకి సభ ఏర్పాటు చెయ్యగా,అందుకు బదులుగా ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ మైదానం మోతెరాలో తన సభ ఏర్పాటు చేశారని కొనియాడారు.
        
అగ్రరాజ్య అధ్యక్షుడు మాట్లాడుతూ హిందీ సినిమాలు చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని వ్యాఖ్యానించాడు.ఆల్ టైం హిట్ సినిమాలైనా ‘షోలే’, ‘దుల్హనియా లే జాయేంగే’ సినిమాలను గుర్తుకు తెచ్చారు.అలాగే భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్,భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారని పేర్కొకొని భారత క్రికెట్ అభిమానుల మనసులు దోచుకున్నారు.గుజరాత్ సంప్రదాయ నృత్యం “భాంగ్రా”   నృత్య రీతి గురించి కూడా మాట్లాడి గుజరాత్ ప్రజల మన్ననలను పొందే ప్రయత్నం చేశారు.
    
ఈ స్టేడియం సామ‌ర్థ్యం ల‌క్షా ప‌దివేల మంది కాగా జ‌నం పోటెత్తడంతో సుమారు ల‌క్షా 25 వేల‌మందికిపైగా ఈ స‌భ‌కు హ‌జర‌య్యార‌ని అంచనా వేస్తున్నారు. “నమస్తే ట్రంప్” కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షా,ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ట్రంప్ సతీమ‌ణి మెలినియా,కూతురు ఇవాంక త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. భార‌త్‌లో ట్రంప్ సోమవారం నుండి రెండు రోజుల‌పాటు ప‌ర్య‌టన జరుపుతున్న సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి