iDreamPost

రక్షా బంధన్‌ రోజు విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు!

రక్షా బంధన్‌ రోజు విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు!

రక్షా బంధన్‌ రోజున ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నకు రాఖీ కట్టాలని ఎదురు చూస్తున్న ఓ చెల్లెలికి ఊహించని షాక్‌ తగిలింది. అన్న చనిపోయాడని తెలిసి గుండెలవిసేలా ఏడ్చింది. చనిపోయినా.. అన్న మీద ఉన్న ప్రేమను చంపుకోలేదు. చివరి వీడ్కోలు పలుకుతూ అన్న మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ సంఘటన తెలంగాణలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్య.. గౌరమ్మ అన్నా చెల్లెళ్లు.

బుధవారం రాఖీ పండుగ కావటంతో గౌరమ్మ అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. తనకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలితో కనకయ్య ఎంతో సంతోషంగా గడిపాడు. అయితే, ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టుండి కనకయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అప్పటివరకు తనతో నవ్వుతూ, తుళ్లుతూ ఉన్న అన్న చనిపోవటంతో గౌరమ్మ షాక్‌ అయింది. విగత జీవిగా మారిన అన్నను చూస్తూ వెక్కివెక్కి ఏడ్చింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తిరిగిరాని లోకానికి వెళ్లిన అన్నకు చివరిసారి రాఖీ కట్టాలనుకుంది. గుండెలవిసేలా ఏడుస్తూ అ‍న్న మృతదేహానికి రాఖీ కట్టింది.

ఈ దృశ్యాలను చూస్తున్న అక్కడి వారి కళ్లు బాధతో చెమర్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గౌరమ్మ ఇలా అన్న మృతదేహానికి రాఖీ కట్టాల్సి రావటాన్ని చూస్తున్న నెటిజన్లు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ చెల్లెలుకు రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, రక్షా బంధన్‌ రోజు చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి