iDreamPost

గోపీచంద్ సినిమా రూటు ఎటు

గోపీచంద్ సినిమా రూటు ఎటు

లాక్ డౌన్ కు ముందే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న గోపీచంద్ సీటిమార్ కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ బ్రేక్ వేసుకున్న సంగతి అందరికీ గుర్తే. అన్నీ సవ్యంగా ఉంటే వకీల్ సాబ్ వచ్చిన వారానికి ఏప్రిల్ లోనే ఇది థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఈపాటికి ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఏవో అంతర్గత కారణాల వల్ల అప్పుడు వాయిదా వేసుకోవడం ఇప్పుడు గుదిబండగా మారినట్టు ఇన్ సైడ్ టాక్. థియేటర్లు తెరుచుకున్నాక కూడా దీని రిలీజ్ గురించి నిర్మాతల నుంచి ఎలాంటి సమాచారం లేదు. టీజర్, లిరికల్ వీడియో తర్వాత టీమ్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అసలు దగ్గరలో వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

తాజాగా ఇది కూడా ఓటిటి బాట పట్టొచ్చనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఓ ప్రముఖ సంస్థ నుంచి చాలా ఆకర్షణీయమైన డీల్ వచ్చిందని, ప్రొడ్యూసర్లు సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని దాని సారాంశం. రచ్చ, గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో జ్వాలా రెడ్డిగా తమన్నా మాస్ షేడ్స్ ఉన్న కోచ్ క్యారెక్టర్ చేసింది. ఉన్నంతలో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. క్లాసు మాసుని కరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు ప్రమోషన్ లో అర్థమైపోయింది. మరి ఇప్పుడు అంతా అనుకూలంగా కనిపిస్తున్న టైంలో ఇది ఏం చేయబోతోందో సస్పెన్స్.

ఇప్పుడీ వార్త రావడానికి కారణం టక్ జగదీష్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేసారనే న్యూస్ రావడం, దాన్ని ఖండిస్తూ ప్రొడక్షన్ హౌస్ ఎలాంటి నోట్ ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు ఇప్పుడు సీటిమార్ మీద కూడా దృష్టి సారించేలా చేశాయి. థియేట్రికల్ బిజినెస్ కు సమానంగా ఆఫర్లు ఇస్తున్న ఓటిటిలు ఇలాంటి నిర్మాతలను చాలా టెంప్ట్ చేస్తున్నాయి. జనం హాళ్లకు వస్తారా రారా అనే అనుమానాలు ఇంకా బలపడుతున్న నేపథ్యంలో ఇంత కన్నా బెటర్ ఆప్షన్ వాళ్లకు కనిపించడం లేదు. ఏదేమైనా టక్ జగదీష్ లా సైలెంట్ గా ఉండకుండా సీటిమార్ అయినా కనీసం ఏదైనా అప్ డేట్ ఇస్తుందేమో వేచి చూడాలి

Also Read : 14 ఏళ్ళ తర్వాత దర్శకుడిగా ఛాన్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి