iDreamPost

ఇజ్జత్‌కా సవాల్‌.. ఉత్తరాంధ్రలో బాబు 30 రోజులుంటారట..

ఇజ్జత్‌కా సవాల్‌.. ఉత్తరాంధ్రలో బాబు 30 రోజులుంటారట..

చంద్రబాబు విశాఖ, విజయనగరం పర్యటనను ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకోవడంతో బ్రేక్‌ పడింది. తన పర్యటననే అడ్డుకుంటారా..? అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ఇది తీవ్ర అవమానంలా భావించిన టీడీపీ కోర్టుకెళ్లింది. ఈ రోజు గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే వచ్చే వారంలోనే మళ్లీ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తారని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్నారు ఆ పార్టీ నేత వర్ల రామయ్య.

ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన తమ ఇజ్జత్‌కా సవాల్‌ అంటోంది టీడీపి. అందుకే ఉత్తరాంధ్రలో 30 రోజులు పర్యటిస్తామని వర్ల రామయ్య ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం తిరుగుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్నారు. వర్ల రామయ్య చెప్పినట్లు చంద్రబాబు 30 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తే.. ఏం జరుగుతుందోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్ధతుగా ప్రకటన చేసిన తర్వాత వస్తే ఫర్వాలేదంటున్నారు. లేదంటే విశాఖ ఎయిర్‌ పోర్టులో జరిగినట్లుగా ప్రతి చోటా అలాంటి అనుభవమే బాబుకు తప్పదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆచరించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. మరి ఇప్పుడు మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతాలు అభివృద్ధి కానవసరంలేదా..? అని సూటిగా అడుగుతున్నారు. ఇప్పుడు కూడా మూడు రాజధానులపై మూడు కళ్ల సిద్ధాంతం అవలంభించొచ్చుకదా అని ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు కోరుతున్నారు. అప్పుడు ఉత్తరాంధ్రలో 30 రోజుల చంద్రబాబు పర్యటన బ్రహ్మాండంగా సాగుతుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు, విజయనగరంలో 9 విశాఖలో 15 నియోజకవర్గాల్లో వెరసి 34 ప్రాంతాల్లో బాబు యాత్ర సాఫీగా సాగుతుందని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి