iDreamPost

ఉయ్యాలవాడ – మర్చిపోలేని తిరుగుబాటు

ఉయ్యాలవాడ – మర్చిపోలేని తిరుగుబాటు

173 సంవత్సరాల కిందట 22-Feb-1847న కుంఫిణీ సైన్యం చేతిలో చంపబడి, 30 సంవత్సరాల పాటు అస్థిపంజరం గ్రామ గుమ్మటానికి వేలాడదీయబడిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర మీద గడచిన 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చిరంజీవి “సైరా” ఈ చర్చకు పునాది వేసింది .

చరిత్రలో ఎవరి మీద జరగనంత దాడి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మీద జరిగింది.దాని ప్రధాన కారణం వర్తమాన సామాజిక,రాజకీయ కారణాలు కావచ్చు.

నరసింహా రెడ్డిది కాదనలేని తిరుగుబాటు
11 రూపాయల పింఛన్ కోసమే నరసింహా రెడ్డి తిరుగుబాటు చేసాడని కొందరి వాదన. చరిత్రలో ఒక్క పోగును పట్టుకొని విశ్లేషిస్తే ఇలాగే ఉంటుంది.

లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఒకే భరణం,ఇనామ్ మరియు మిరాశీ వ్యవస్థల రద్దు తదుపరి రాజ్యసంక్రమణ సిద్ధాంతం (అధికారికంగా 1848లో అమలులోకి వచ్చింది కానీ ముందే కొన్ని సంస్థానాల సంక్రమణ హక్కులను తిరస్కరించారు ) కారణాలతో ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి నోసుమ్ జాగీర్ ను కోల్పోవలసి రావటం, స్థానిక తాశీల్ధారు నోటి దురుసు నరసింహా రెడ్డి తిరుగుబాటుకు కారణాలుగా చూడాలి కానీ 11 రూపాయల 10 పైసల 8 అణాల కోసం నర్సింహారెడ్డి తిరగబడ్డాడు అనటం సహేతుకం కాదు.

నరసింహారెడ్డి ఇద్దరు అన్నలు మొదటి నుంచి కుంఫిణీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. తమ్ముడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటుకు మద్దతుగా నిలవలేదు. కుంఫిణీ పట్ల వీరి భక్తిని గుర్తించి 26-Jun-1847నాడు (అప్పటికే నరసింహా రెడ్డి ఉరి తీయబడ్డాడు) వీరి పింఛన్ను రెట్టింపు చేస్తూ కుంఫిణీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఒక కుటుంబంలో ముగ్గురు సోదరులలో ఇద్దరు కుంఫిణీకి అనుకూలంగా ఉండి పింఛన్ను రెట్టింపు చేసుకోగా తిరగబడ్డ నరసింహారెడ్డిది ఉక్రోషపు ఆరాటం అనటం సమంజసం కాదు.

ఝాన్సీ లక్ష్మి భాయి తిరుగుబాటు ఎందుకు జరిగిందో పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నవారందరికి ఆవిడ కూడా తన దత్తకొడుక్కి వారసత్వం ఇవ్వటానికి కుంఫిణీ ప్రభుత్వం నిరాకరించటమే కారణం అని అర్ధమవుతుంది.ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటును చూసిన అద్దంలో లక్ష్మి భాయి పోరాటాన్ని చూడగలరా?

కుంఫిణీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఏ తిరుగుబాటైన బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో జరిగిన తిరుగుబాటులోనైనా స్వాతంత్రేచ్ఛ ఉన్నదన్న సత్యాన్ని మరువకూడదు . ప్రతి విప్లవానికి వేలాది మంది ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని కూడా విస్మరించకూడదు. నరసింహారెడ్డి వెనుక 9000 మంది సైన్యం ఉందని,ఆయన తిరుగుబాటు కేసులో కుంఫిణీ ప్రభుత్వం 901 మంది మీద కేసుపెట్టి ,అందులో 122 మందికి కఠిన శిక్షలు అమలుచేశారన్న విషయం విస్మరించరాదు.

ఇలాంటి వాదనల మీదనే 1955 లో ముద్రితమైన SB Chowdary రచించిన Civil Disturbance during the British Rule in India (1765-1857) పుస్తకం ముందు మాటలో Prof. SP Sarkar ఇలా అన్నారు–

The risings against British authority have often enough been dismissed as outcome of the machinations of a number of dispossessed malcontent personas. But of course the problem is where the following came from and why did people respond to the intrigues of interested parties. It is after all a superficial view of history to remain satisfied with attributing all disturbances to agitators. 

ఈ పుస్తకం 1765 నుంచి 1857 అంటే మనం చదువుకున్న సిపాయిల తొలి తిరుగుబాటు వరకు జరిగిన పోరాటాల గురించి వివరిస్తుంది. పునాదులు లేని ఏ పోరాటమైనా విజయం సాధించలేదు. భారత్ స్వాతంత్ర పోరాటానికి పునాదులు పడింది పాలెగార్ల పోరాటంతోనే. కట్టబొమ్మన నుంచి నరసింహా రెడ్డి వరకు వారి లక్ష్యాలు ఏవైనా అందరు స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన వారే.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర పోరాట యోధుడు అనటం చరిత్ర వక్రీకరణా?

2018లో కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఒరిస్సాలో 1817లో జరిగిన రైతాంగ పోరాటం “పైకా పోరాటాన్ని” తొలి స్వాతంత్ర పోరాటంగా గుర్తిస్తామని చెప్పారు. ఆ ప్రకటన వెనుక రాజకీయ లక్ష్యాలు ఉండవచ్చు కానీ పైకా పోరాటాన్ని కూడా స్వతంత్ర పోరాటానికి పునాది వేసిన తిరుగుబాటుగా చూడాలి.

ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి చరిత్రలో వినిపించే జానపదం …

యీపోద్దిదియా ,రేపు తదియారా ,నరుని ప్రాణమొయి
నీటి మీదను బుగ్గ వంటింది నరుని శరీరంబు
పదరా పదరాా తెల్లవాడ్ని తెగనరుకుదాము …

–ఇందులో తెల్లవాడు కుంఫిణీ ఉద్యోగా ?బ్రిటన్ రాణి భటుడా? అన్నది తిరగబడ్డ సామాన్యులకు అనవసర విషయం.. వాడు బ్రిటీష్ వాడు ,వాడు పరాయి వాడు.. యుద్ధం వాడి మీదనే !

స్వాతంత్రమనే లక్ష్యం సాధించిన తరువాత దానికి బాట వేసిన ప్రతి తిరుగుబాటును గుర్తించవలసిందే. ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది పెద్ద ప్రాముఖ్యత ఉన్న అంశం కాదు. తమిళనాడు నుంచి ఆదోని వరకు 1799-1807 మధ్య జరిగిన పాలెగార్ల తిరుగుబాటును కూడా గుర్తించాలి.

ఏది తొలి ఏది మలి పోరాటం అన్నదాని మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు కానీ నరసింహా రెడ్డి తిరుగుబాటును గుర్తించాలి ,ఆయన పోరాటాన్ని 11 రూపాయల పింఛన్ ఆరాటం అనటం దురుద్దేశ్య పూరితం.

సైరా సినిమా

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మీద ఇప్పుడు ఈ స్థాయి చర్చ జరగటానికి చిరంజీవి సైరా సినిమానే ప్రధానకారణం. సినిమా వాళ్ళు “స్పూర్తితో ” అని ఒక్క మాట అనేసి కథని వాళ్లకు నచ్చినట్లు అల్లుకుంటారు.

సైరా సినిమా చూసినంత సేపు ఎక్కడా నరసింహా రెడ్డి కానీ ,ఆనాటి చరిత్ర కానీ కనిపించదు. పొడుగు గడ్డంతో కర్మ సిద్ధాంతి లాగా అమితాబ్ మాట్లాడే మాటలు ,చివరికి నర్సింహా రెడ్డి తన ప్రాణం కన్నా ,తన పోరాటం కన్నా కార్తీక పున్నమి రోజు కొండ మీద గుడిలో దీపం పెట్టటమే ముఖ్యం అన్నట్లు చిత్రించారు …
సైరా పోరాటమా?కార్తీక ద్వీపమా?అన్నట్లు చేశారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రను సజీవంగా నిలిపింది జానపద గీతాలే.

సైరా! నరసింహా రెడ్డి!
నీ పేరంటే – రాజా నరసింహా రెడ్డి!
కోయిలకుంట్ల కరణమయ్యా
ఆయన పేరే ఎంకట్రాముడు
లక్ష్మిరెడ్డి ఢాకాలకూ
దత్తనాల మూట ఎత్తులకు
పారిపోతాడు కరణమయ్యా “సైరా “… ఈ పాట నేటికీ గ్రామాలలో వినిపిస్తుంది.

రాజారావు,రాజా బహదురు నారసింహారెడ్డి
రెడ్డికాదు ,బంగారు కడ్డీ నారసింహారెడ్డి
ములుకోల కట్టే చేతులో వుంటే మున్నూటికి మొనగాడు
కరువొచ్చినా కాటకమొచ్చిన ఆదరించే రెడ్డి||
రెడ్డికోసం ప్రాణం పోయిన సర్గం వొస్తుంది
యీపోద్దిదియా ,రేపు తదియారా ,నరుని ప్రాణమొయి
నీటి మీదను బుగ్గ వంటింది నరుని శరీరంబు
పదరా పరదారా తెల్లవాడ్ని తెగనరుకుదాము ||.. ఎంతో ఉత్సహాన్ని ఇచ్చే పాటలు ఇవి.. ఇలాంటి జానపదాలు లేకుంటే నరసింహా రెడ్డి చరిత్ర ప్రజల నోళ్ళలో ఇంత కాలం నానేది కాదు.. ఇలాంటి పాటలు సినిమాలో వాడి ఉంటే సినిమాకు మంచి ఊపు వచ్చిఉండేది.. నరసింహా రెడ్డి గురించి వాస్తవ చరిత్ర తెలిసేది.

నరసింహా రెడ్డి కోటలను ,పోరాట చిహ్నాలను కాపాడాలి

నరసింహా రెడ్డి పాలించిన నోసుమ్ కోట చాలా వరకు పడిపోయింది కానీ కొన్ని బురుజులు శిధిలం కాలేదు. ఈ కోట లోని ముళ్ల చెట్లను తొలగించి కోట ఆక్రమణకు గురి కాకుండా నరసింహా రెడ్డి స్మారక చిహ్నం గా అభివృద్ధి చెయ్యాలి.


నరసింహా రెడ్డి కి చెందిన కొత్తకోట కూడా శిధిలం కాలేదు. కొత్తకోట ఊరి మొదట్లో చిన్న తిప్ప మీద ఇప్పటికీ ఒక ఫిరంగి ఉంది.తిప్ప మీద మట్టి జారిపోతుండటంతో ఈ ఫిరంగి మరి కొన్ని సంవత్సరాలలో కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఫిరంగి సుమారు ఒక టన్ను నుంచి 1200 కేజీల బరువు ఉండవచ్చు.తుప్పు పట్టకుండా దృడంగా ఉంది.

నరసింహా రెడ్డి కుంఫిణీ సైన్యానికి చిక్కిన జగన్నాధ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి.

డాక్టర్ జోలపాలెం మంగమ్మ గారు ఇలా అంటారు ,

Historians have been unkind to the palegars in that they were completely ignored or even when noticed were depicted more as plunders rather than those who fought for freedom of their land. It is only recently that scholars have begun to view the problem of palegahrs as political…

ప్రజా పీడన లేని రాచరికం లేదు.. ప్రజలను అణచని పాలెగార్ లేకపోవచ్చు ..నేటి ప్రజాసామ్యంలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని కాదు .. అంత మాత్రాన చరిత్రలో జరిగిన సంఘటనలు,తిరుగుబాట్లను విస్మరించ లేము ..

22-Feb-1947 ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి 173వ వర్ధంతి .. సందర్భంగా .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి