iDreamPost

పాక్‌ను దంచేసిన భారత్‌.. 10 వికెట్లతో ఘన విజయం

పాక్‌ను దంచేసిన భారత్‌.. 10 వికెట్లతో ఘన విజయం

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. దాయాది పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువ సంచలనం ఓపెనర్‌ యశ్వంత్‌ జైశ్వాల్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. 113 బంతుల్లో ఎనిమిది ఫోర్లు 4 సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ సక్సేనా 99 బంతుల్లో 59 పరుగులు చేశాడు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ను 43.1 ఓవర్లలో 172 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. సుశాంత్‌ మిశ్రా మూడు వికెట్లు తీసుకోగా, కార్తిక్‌ త్యాగి రెండు, రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. అంకోల్కెర్, యశస్వి జైస్వాల్‌ చెరో వికెట్‌ తీశారు. పాక్‌ ఆటగాళ్లలో హైదర్‌ అలి 77 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కెప్టెన్‌ రోహైల్‌ 102 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించారు. మిగతా మొత్తం బ్యాట్స్‌మెన్స్‌ విఫలమయ్యారు. కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

మొదటి నుంచి పొదుపుగా బౌలంగ్‌ వేసిన భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఏ దశలోనూ పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. తర్వాత బ్యాటింగ్‌ దిగిన ఓపెనర్లు పాక్‌ను ఓ ఆట ఆడుకున్నారు. వికెట్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 35.2 బంతుల్లోనే 176 పరుగులు సాధించి జట్టుకు విజయం అందించారు. ఈ మ్యాచ్‌ గెలుపుతో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి