iDreamPost

Revanth Reddy-Dalit Bandhu: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఈసారి దళితబంధుపై

  • Published Dec 21, 2023 | 11:08 AMUpdated Dec 21, 2023 | 11:08 AM

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దళితబంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దళితబంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 21, 2023 | 11:08 AMUpdated Dec 21, 2023 | 11:08 AM
Revanth Reddy-Dalit Bandhu: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఈసారి దళితబంధుపై

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. అలానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను, పథకాలను రద్దు చేసే ఆలోచనలో ఉంది. సాధారణంగా.. ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పూర్తిగా మార్చేస్తారు. మరికొన్నింటిపై సమీక్షలు చేసి.. వాటిని కొనసాగించాలా.. నిలిపివేయాలా అనే దానిపై నిర్ణయాలు తీసుకుంటారు. అలానే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. కొన్ని పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే దళితబంధుకు సంబంధించి.. తాజాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై నూతన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా దళితబంధు రెండోవిడతలో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఎస్సీ సంక్షేమశాఖ నిలిపివేసింది. దాదాపు 50 వేల దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటికే యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సహాయాన్ని అందించాలా.. నిలిపివేయాలా అన్న దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటూ.. ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ రాసింది.

On Dalit Bandhu Revanth is a key decision

గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం తొలి విడత కింద రాష్ట్రంలోని 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం రూ.4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సహాయంతో యూనిట్లు మంజూరు చేసింది. తొలివిడతలో ఎంపికైన లబ్ధిదారులందరికీ నిధులు విడుదలయ్యాయి. రెండో విడతలో భాగంగా.. నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున (హుజూరాబాద్‌ మినహా) సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని ఎన్నికల ముందు బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి జిల్లా కలెక్టర్లకు 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ వివరాలన్నింటిని కలెక్టర్లు గతంలోనే దళితబంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. రెండోవిడత కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మురుగు వ్యర్థాల రవాణా వాహనాలు ఇచ్చి, వాటిని జలమండలితో అనుసంధానం చేశారు. ఇతర జిల్లాల్లో మరో 238 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి, తొలివిడత నిధులిచ్చారు. ఈ లబ్ధిదారులకు రెండో విడత నిధుల విడుదలపై సందిగ్ధత నెలకొంది. దీనిపై రేవంత్ సర్కార్ నిర్ణయం మేరకు ఎస్సీ శాఖ తదుపరి చర్యలు తీసుకొనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి