iDreamPost

బ్రాహ్మ‌ణి వైపు తమ్ముళ్ల చూపు! లోకేశ్‌ని లైట్ తీసుకున్నారా?

బ్రాహ్మ‌ణి వైపు తమ్ముళ్ల చూపు! లోకేశ్‌ని లైట్ తీసుకున్నారా?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్టుతో వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించి, తిరిగి అధికారాన్ని చేపట్టాలని పోటీ పడుతున్న టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. అయితే మధ్యలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చి.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన టీడీపీకి, ఆ శ్రేణులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. మొన్నటి వరకు ఈ పార్టీని, పవన్‌ను తిట్టిన నోళ్లు.. నేడు పొత్తు పేరుతో ఆ పార్టీ పంచన చేరి భజన చేయాలా అని మీమాంసలో పడిపోయారు. టీడీపీ పగ్గాలను చేపట్టి, దిశా నిర్దేశం చేసే సరైన నాయకుడు లేకపోవడంతో దిగులు చెందుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ సమయంలో వారికి ఆశాదీపంగా కనిపించింది బ్రాహ్మణి.

చంద్రబాబు అరెస్టుతో నేతలకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాధుడు కరువయ్యారు. పార్టీ తదుపరి పెద్దగా బాలకృష్ణ కనిపించినప్పటికీ.. ఆయన ఎప్పుడు, ఎలా ఉంటారో టీడీపీ శ్రేణులకు బాగా తెలుసు. ఇక చంద్రబాబు కుమారుడు, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తమకు దిక్కు అనుకున్నారు. కానీ ఎక్కడా టీడీపీ తమ్ముళ్లకు ధైర్యం చెప్పే ప్రకటన చేయలేదు సరికదా.. ఢిల్లీ వెళ్లి మరీ తన తండ్రి తప్పు చేయలేదంటూ నేషనల్ మీడియా ముందు వాపోయాడు. ఇదే సమయంలో తన మామ తరుఫున తొలిసారిగా బయటకు వచ్చారు నందమూరి అమ్మాయి, నారా వారి కోడలు బ్రాహ్మణి. తన మామకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన ఆమె.. ఆకట్టుకునే విధంగా స్పీచ్ ఇచ్చింది. దీంతో తమ దారి ఎటో తెలియక సతమతమవుతున్న టీడీపీ శ్రేణులకు జీవం వచ్చినట్లు అయ్యింది. పార్టీని నడిపించడంలో లోకేష్ అసమర్థుడని తమ్ముళ్లు బలంగా విశ్వసిస్తుండటంతో బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ ఈ అంశాన్ని రక్తి కట్టించేందుకు బ్రాహ్మణిని హైప్ చేస్తూ..లోకేష్ పరువు తీసేస్తున్నాయి.

ఓ మీడియా సాక్షిగా యాంకర్ చెప్పిన మాటలు చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. అందులో ఆమె ఏకంగా.. ఆర్జీవీ బ్రాహ్మణికి సలహా ఇచ్చినట్లుగా బ్రాహ్మణికి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. ‘బ్రాహ్మణి ఇక సమయం లేదు. కొంగు నడుముకు చుట్టి, బయటకు రండి. మీ కోసం తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు. నందమూరి కుటుంబ వీరనారిగా నడుం బిగించండి. ఎన్టీఆర్ మనవరాలిగా, బాలయ్య కూతురిగా, చంద్రబాబు కోడలిగా, లోకేష్ భార్యగా మీకున్న ఛార్మ్ మరొకరికి లేదు. మీకున్న జ్ఞానం , విజ్ఞానం ఎవ్వరికీ లేదు’ అంటూ సదరు యాంకర్ ఊదరగొట్టింది. ఇది చూస్తే లోకేష్ కు రాజకీయాల్లో అంత సీన్ లేదని ఆమె చెప్పకనే చెప్పేసింది. మరి బ్రాహ్మణి రంగంలోకి దిగితే లోకేష్ ఏం చేయాలో సెలవిస్తే కూడా సరిపోయేది కదా అని సెటైర్లు కూడా విసురుతున్నారు. తాను ఓ అసమర్థత నేతగా ముద్ర పడుతున్న సమయంలో.. తనను తాను నిరూపించుకునేందుకు యువగళం పేరుతో ప్రచారాలు చేస్తున్నాడు లోకేష్. ప్రజల నుంచి ఆదరణ కొరవడినా.. తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. కానీ బ్రాహ్మణి రంగంలోకి దిగి.. పార్టీని తన ఆధీనంలోకి తీసుకుంటే..తెలుగు తమ్ముళ్లు ఆమెనే పార్టీ దిక్సూచిగా చూస్తూ.. లోకేష్ ను పట్టించుకోకపోతే.. పాపం అతని పరిస్థితి ఏంటో తెలియాలి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బ్రాహ్మణి రంగంలోకి దిగితే లోకేష్ పరిస్థితి ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి