sai
Ponnam Prabhakar: ప్రజావాణికి .. తమ వినతులు అందజేసేందుకు ప్రజలు పోటెత్తారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ఇళ్లు, ధరణి, పింఛన్లు లాంటి సమస్యల మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
Ponnam Prabhakar: ప్రజావాణికి .. తమ వినతులు అందజేసేందుకు ప్రజలు పోటెత్తారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ఇళ్లు, ధరణి, పింఛన్లు లాంటి సమస్యల మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
sai
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి.. అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్ కు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచే ప్రజాభవన్ వద్ద క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో డిసెంబర్19 న జరిగిన ప్రజావాణికి .. తమ వినతులు అందజేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యి.. ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం కొన్ని కీలక ప్రకటనలు చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ఇళ్లు, ధరణి, పింఛన్లు లాంటి సమస్యల మీద.. ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యల పరిష్కారం కోసం.. ప్రజలు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదని మంత్రి ప్రభాకర్ స్పష్టం చేశారు. వీటిపై కొత్త విధానాలు సిద్ధమయ్యాక ఎవరి ప్రాంతాలలో ఉన్న సమస్యలను వారున్న చోటునుంచే.. పరిష్కరించుకునే మార్గాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ఇందిరమ్మ ఇళ్లపై ప్రకటన చేసిన విషయాన్నీ.. గుర్తుచేస్తూ, దానికోసం ఒక విధానాన్ని రూపొందిస్తామని అన్నారు.

ఇక మాజీ ప్రభుత్వం పదేళ్ల నుంచి బంగారు తెలంగాణ చేశామని చెప్పిందని.. అప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించి ఉంటే, ఇప్పుడు ప్రజావాణికి ఇంతమంది ప్రజలు ఎందుకు తరలివస్తున్నారని.. పొన్నం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అధికారులు అంతా కలిసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పొన్నం ఆటో డ్రైవర్లకు కూడా ఓ శుభవార్త చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ కారణంగా ఆటో కార్మికుల ఉపాధికి భారీ నష్టం వాటిల్లింది. దీనితో వారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయమై మంత్రిమండలిలో చర్చించామని.. ఆటో డ్రైవర్లు కాస్త ఓపికతో ఉండాలని తెలియజేశారు. అతి త్వరలో వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతాం అని పొన్నం పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో.. దాదాపు 5,234 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో 55 శాతం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం, 30 శాతం పింఛన్ల కోసం ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే వారు.. ఉదయం 10 గంటలలోపే రావాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తామని, కాబట్టి 10 గంటల లోపు వచ్చిన వారిని ప్రజాభవన్ లోపలికి అనుమతిస్తామని చెబుతూ.. ప్రజాభవన్ ఎదుట బోర్డులు ఏర్పాటు చేశారు. ఏదేమైనా, ఏ ప్రాంతంలోని సమస్యలను ఆ ప్రాంతంలోనే పరిష్కరించే మార్గం ఏర్పాటు చేయడం వలన.. ప్రజలకు కాస్త ప్రయాణ భారం తగ్గుతుందని చెప్పి తీరాలి. మరి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల గురించి.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.