iDreamPost
android-app
ios-app

ఇంటికి రాగానే అన్నకు రాఖీ .. జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన KTR..!

  • Published Aug 29, 2024 | 8:40 AM Updated Updated Aug 29, 2024 | 8:40 AM

KTR Rakhi Gift To Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ మీద జైలు నుంచి ఇంటికి వచ్చిన కవిత రాగానే అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టింది. ఆ వివరాలు..

KTR Rakhi Gift To Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ మీద జైలు నుంచి ఇంటికి వచ్చిన కవిత రాగానే అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టింది. ఆ వివరాలు..

  • Published Aug 29, 2024 | 8:40 AMUpdated Aug 29, 2024 | 8:40 AM
ఇంటికి రాగానే అన్నకు రాఖీ .. జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన KTR..!

దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా తీహార్‌ జైల్లో ఉన్న కవిత.. రెండు రోజుల క్రితం అనగా.. మంగళవారం(ఆగస్టు 27న) బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ అనంతరం బుధవారం నాడు అనగా ఆగస్టు 28న హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే కవిత మొట్టమొదటగా చేసిన పని.. తన సోదరుడైన కేటీఆర్‌కు రాఖీ కట్టటమే. ఈసారి రాఖీ పండుగ నాడు కవిత జైల్లో ఉండటంతో.. కేటీఆర్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ రాఖీ పండుగ నాడు.. తన సోదరి కవిత తనతో లేరని.. కానీ ఆమెకి తాను ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

జైలు నుంచి రాగానే కవిత ఆయనకు రాఖీ కట్టడంతో.. తన చెల్లి రాఖీ కట్టటంతోనే.. రాఖీ ఫీలింగ్ తీరిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్. అయితే.. ప్రతిసారి రాఖీ పండుగకు ఈ ఇద్దరు రకరకాల గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అందులో ఓసారి కేటీఆర్‌కు కవిత హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చి.. సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో.. వీళ్లిద్దరూ ఇచ్చుకునే బహుమతిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మరి ఈ ఏడాది కేటీఆర్‌ కవితకు ఏం గిఫ్ట్‌ ఇచ్చాడంటే.. ఆమెకు బెయిల్‌ ఇప్పించి.. అన్నగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అరెస్టయినప్పటి నుంచి కేటీఆర్ ఎప్పుడుపడితే అప్పుడు ఢిల్లీకి వెళ్లటం.. బెయిల్ కోసం ప్రయత్నించటం, న్యాయనిపుణులతో చర్చలు జరపటం మాత్రమే కాక.. జైల్లో ఉన్న కవిత అనారోగ్యానికి గురైనప్పుడు హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని.. ఆమె బాగోగులు చూడటం..ఇలా ప్రతిసారి కేటీఆర్, కవితకు అండగా నిలిచారు. చివరికి.. ఐదున్నర నెలల తర్వాత కవితకు బెయిల్ వచ్చిందంటే.. దాని వెనుక కేటీఆర్ చేసిన గట్టి ప్రయత్నం ఉందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో.. కవితకు బెయిల్ ఇప్పించి.. రాఖీ కట్టే కంటే ముందే జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అతిపెద్ద బహుమతిని కేటీఆర్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒక అన్నగా.. చెల్లికి ఇంతకంటే మంచి బహుమతి ఏం ఉంటుంది.. అని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాఖీ పౌర్ణమి అయిపోయిన పది రోజులకు కవిత రాఖీ కట్టినా.. కేటీఆర్ మాత్రం విలువైన బహుమతి ఇచ్చి.. తన చెల్లి కళ్లల్లో ఆనందం చూశారని కామెంట్స్‌ చేస్తున్నారు.