iDreamPost
android-app
ios-app

శరన్నవరాత్రుల వేళ.. హైదరాబాద్‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం!

Durga Matha: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పండగ వేళ దుర్గామాత విగ్రహం ధ్వంసానికి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.

Durga Matha: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పండగ వేళ దుర్గామాత విగ్రహం ధ్వంసానికి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.

శరన్నవరాత్రుల వేళ.. హైదరాబాద్‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం!

దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. దుర్గాదేవీ అలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. భక్తులు దుర్గా దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. కోర్కెలు తీర్చే అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. దుర్గా దేవీ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయదశమి పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా అమ్మవారి వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంటారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా దుర్గా మాతా విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో కూడా అమ్మ వారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. భవానీ మాలధారణతో పిల్లలు పెద్దలు నిష్టతో గడుపుతున్నారు. అమ్మవారి కటాక్షం కోసం భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హిందువులంతా దేవీ శరన్నవరాత్రులను ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు.

నియమ నిష్టలతో దుర్గాదేవిని కొలుస్తారు. ఇంతటి ప్రత్యేకత ఉన్న దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసానికి గురైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అమ్మవారి విగ్రహం ధ్వంసంకావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కాగా గురువారం రాత్రి అమ్మవారి ఆలయం వద్ద దాండియా కార్యక్రమం నిర్వహించారు.

భక్తులు అంతా ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో కరంట్‌ కట్‌చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. పూజా సామాగ్రిని చిందరవందరగా పడేశారు. శుక్రవారం ఉదయం స్థానికులు అమ్మవారి విగ్రహం ధ్వంసం అయినట్లు గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసానికి గురైందన్న విషయం తెలయడంతో భక్తులు, హిందూ సంఘాలు అక్కడికి భారీగా చేరుకున్నాయి.

సమాచారం అందుకున్న అబిడ్స్‌ ఏసీపీ చంద్ర శేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం దుండగులు హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేశంలో హిందూ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.