iDreamPost

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ధీటుగా బిచ్చగాళ్ల సంపాదన.. నెలకు లక్షల్లో ఆదాయం

  • Published Aug 21, 2023 | 9:44 AMUpdated Aug 21, 2023 | 1:37 PM
  • Published Aug 21, 2023 | 9:44 AMUpdated Aug 21, 2023 | 1:37 PM
హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ధీటుగా బిచ్చగాళ్ల సంపాదన.. నెలకు లక్షల్లో ఆదాయం

బిచ్చగాళ్లు చూడ్డానికి మాత్రమే అలా ఉంటారని.. వారి ఆదాయం సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ కన్నా భారీగా ఉంటుందనే వార్తలు గతంలో అనేకం వచ్చాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇండియాకు చెందిన వాడే అంటే.. మన దగ్గర బిచ్చాగాళ్ల ఆదాయం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు.. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భిక్షమెత్తుతున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుని కర్ణాటకకు చెందిన అజిత్ పవార్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. పవార్‌పై ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. పవార్ వృద్ధులు, పిల్లలకు ఒక్కొక్కరికి రోజు వారీ కూలీ చెల్లించి.. వారి చేత భిక్షాటన చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బిచ్చగాళ్లు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఉంటూ ఒక్కొక్కరూ రోజుకు వేలల్లో సంపాదించినా.. పవార్ వారికి కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేవాడని పోలీసుల విచారణంలో వెల్లడయ్యింది.

ఈ బెగ్గింగ్ మాఫియా కేసులో పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. హైదరాబాద్‌లోని పలు ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భిక్షాటన చేసే కొంతమంది బిచ్చగాళ్ల నెల ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉందని తెలిసి పోలీసులే షాక్‌ అయ్యారు. బిచ్చం ఎత్తుకునే కుటుంబాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్‌లలో ట్రాఫిక్ జంక్షన్‌లను ఆక్రమించుకొని భిక్షం ఎత్తుకుంటున్నట్లుగా తేలింది.

అచ్చం పోకిరి సినిమాలోలానే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త, భార్య, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్‌ను ఆక్రమించుకుంటుంది. ఇక అక్కడ ఇతరులెవరిని భిక్షాటన చేయడానికి వారు అనుమతించరు. ఇలా కుటుంబం మొత్తం ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుని.. రోజుకు రూ.4,000-రూ. 7,000 వరకు సంపాదిస్తున్నారని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ లెక్కన వీరి నెల ఆదాయం 1.50 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

ఇక వీరు నగరంలో రద్దీగా ఉండే ప్యారడైజ్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, ట్యాంక్ బండ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం వంటి జంక్షన్‌లను ఎంచుకుంటారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రాకూడదు. కాదని ఏరియా విషయంలో ఈ గుంపుల మధ్య వివాదాలు తలెత్తితే.. పెద్దలు జోక్యం చేసుకుంటారు.

ఆటోలో రాకపోకలు..

బెగ్గింగ్ గుంపుల మధ్య టైమింగ్ స్లాట్‌లు కూడా ఉంటాయి. కుటుంబం మొత్తం ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉదయం 10 గంటల నుంచి బిక్షాటన చేస్తుంటారు. వీరిని ఆ జంక్షన్ వద్దకు ఆటోల్లో తీసుకొస్తారు. తిరిగి సాయంత్రం ఆటోల్లో ఇళ్లకు చేరుకుంటారు. ఇంటికి వెళ్లేటప్పుడు బిర్యానీ, కల్లు, మద్యం వంటివి తీసుకొని వెళ్తారు. బెగ్గింగ్ చేసే కుటుంబాలలో కొందరు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారు.

ఇక ఈ బెగ్గింగ్ మాఫియాలో ప్రధాన సూత్రదారి కర్ణాటక గుల్బర్గాకు చెందిన అజిత్ పవార్ కూడా బాగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును అజిత్‌ పవార్‌.. చిట్ ఫండ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. ఇక ఇతడికి కర్ణాటకలో రెండు ఇళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి