iDreamPost
android-app
ios-app

ఛీ.. యాచకుడ్ని కూడా వదల్లేదు..

ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువ లేకున్నా.. కుటుంబాన్ని పోషించాలని ఓ గుడి దగ్గర భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బిడ్డ చదువు కోసం కొంత డబ్బు కూడబెట్టాడు. వీటిపై కన్నేశాడు ఓ కేటుగాడు

ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువ లేకున్నా.. కుటుంబాన్ని పోషించాలని ఓ గుడి దగ్గర భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బిడ్డ చదువు కోసం కొంత డబ్బు కూడబెట్టాడు. వీటిపై కన్నేశాడు ఓ కేటుగాడు

ఛీ.. యాచకుడ్ని కూడా వదల్లేదు..

ఒంట్లో సత్తువ లేకపోవడంతో పాటు పని కూడా ఇచ్చేందుకు నిరాకరించడంతో గతిలేక బిచ్చగాడిగా మారాడు ఓ వృద్ధుడు. కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన బిడ్డల్ని పస్తులుంచలేక.. ఓ గుడి దగ్గర బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ చిన్న కుటీరంలో తలదాచుకుంటూ గుడి దగ్గరే యాచిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.  యాచించగా వచ్చిన డబ్బుల్ని.. బిడ్డ భవిష్యత్తు కోసం దాచాడు.  కానీ ఈ డబ్బులపై కన్నేశాడో కేటుగాడు. ఆ డబ్బులు నీ దగ్గర ఉంటే.. డబుల్ అవుతాయా..? నాకు ఇవ్వు.. వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికాడు. నీకు అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన బిచ్చగాడు.. రూ. 50 వేలు ఇచ్చాడు. అప్పటి నుండి వడ్డీ ఇవ్వకపోగా.. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టాడు. అప్పు తీసుకున్న డబ్బులు చెల్లించాలేనంటూ ఐపీ పెడుతూ యాచకుడికి నోటీసులు పంపాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు బిచ్చగాడు.

బిచ్చగాడితో పాటు 69 మందికి పంగనామాలు పెట్టాడో హోటల్ వ్యాపారి. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌లో చోటుచేసుకుంది. అశోక్ అనే వృద్ధుడు కొన్నాళ్ల నుండి బోనకల్‌లో సాయి బాబా గుడి దగ్గర బిక్షాటన చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిడ్డ చదువు, భవిష్యత్తు కోసం కొంత డబ్బులు దాస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన హోటల్ వ్యాపారి నర్సింహారావు.. మూడేళ్ల క్రితం.. అధిక వడ్డీ ఆశ చూపి.. బిచ్చగాడి దగ్గర నుండి రూ. 50 వేలు తీసుకున్నాడు. అప్పటి నుండి వడ్డీ చెల్లించకపోగా.. మొత్తానికి ఎసరు పెట్టాడు. ఎన్ని సార్లు అడిగినా మొహం చాటేసేవాడు. చివరకు చిల్లిగవ్వ కూడా చెల్లించేది లేదంటూ అప్పు తీసుకున్న వాళ్లందరికీ ఐపీ పెట్టాడు. అలాగే నోటీసులు కూడా పంపాడు. ఆ నోటీసులు అందుకున్న వారిలో యాచకుడు అశోక్ కూడా ఒకరు.

సుమారు 69 మంది దగ్గర డబ్బులు తీసుకున్న నర్సింహారావు.. అందరకీ పంగనామాలు పెట్టాడు. అధిక వడ్డీ ఆశ చూపి కోటి 95 లక్షలు అప్పు తీసుకుని, వారందరికీ ఐపీ పెట్టేశాడు. అప్పులు తీర్చలేనంటూ ఖమ్మంలోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఐపీ నోటీసులు అందుకున్న అశోక్.. లబోదిబోమంటున్నాడు. అడుక్కుని సంపాదిస్తున్న సొమ్ము.. తిని తినక.. బిడ్డ చదువుల కోసం డబ్బులు దాస్తే.. వడ్డీ ఇస్తానంటూ నర్సింహారావు డబ్బులు తీసుకున్నాడని, ఇప్పుడేమో మోసం చేశాడంటూ వాపోతున్నాడు యాచకుడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. తాము దగ్గర నర్సింహారావు తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాడు. కాగా, యాచకుడినే మోసం చేసిన ఘటన స్థానికంగా చర్చగా మారింది. సరైన గూడు కూడా లేని బిచ్చగాడిని ఎలా మోసం చేయాలనిపించిందని బహిరంగంగానే మోసగాడ్ని తిడుతున్నారు స్థానికులు.