iDreamPost
android-app
ios-app

చాహల్​ను సెలెక్ట్ చేయకపోవడంపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు! గొడవపడ్డాడంటూ..

  • Author singhj Published - 07:27 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 07:27 PM, Tue - 19 September 23
చాహల్​ను సెలెక్ట్ చేయకపోవడంపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు! గొడవపడ్డాడంటూ..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్​కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు పలువురు ప్రధాన ఆటగాళ్లను దూరం పెట్టింది. ఆసియా కప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో గాయపడిన స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను​ మొదటి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అలాగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. ఈ రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. మూడో మ్యాచ్​లో కోహ్లీ, హార్దిక్ అందుబాటులో ఉంటారు. మూడో మ్యాచ్​కు రోహిత్ తిరిగి జట్టు పగ్గాలు చేపడతాడు.

ఆసీస్​తో మూడు వన్డేల సిరీస్​కు ప్రకటించిన జట్టులో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​కు చోటు దక్కలేదు. ఆసియా కప్​లో గాయపడిన అక్షర్ పటేల్ ప్లేసులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్​లోనూ చాహల్​కు చోటు దక్కని విషయం విదితమే. ఈ నేపథ్యంలో చాహల్​ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. అసలు చాహల్​ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. టీమ్​లో ఉండాల్సిన ప్లేయర్లలో చాహల్ ఒకడని.. టాలెంట్ పరంగా అతడు అద్భుతమన్నాడు భజ్జీ.

‘ఆస్ట్రేలియాతో సిరీస్​కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ ఉంటే బాగుండేది. అతడికి ఛాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకిలా జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా? అనేది తెలియడం లేదు. కేవలం మనం టాలెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతడు జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం కంగారూలతో వన్డే సిరీస్​లోకైనా చాహల్​ను తీసుకుంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆసీస్​ను ఓడించాలంటే బాగా కష్టపడాలి’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: రజినీకి BCCI గోల్డెన్ టికెట్.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?