iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీ అంత గొప్పోడా? ఆసక్తికర లెక్కలు వెలుగులోకి..

  • Published Jul 28, 2023 | 1:46 PM Updated Updated Jul 28, 2023 | 1:46 PM
  • Published Jul 28, 2023 | 1:46 PMUpdated Jul 28, 2023 | 1:46 PM
విరాట్‌ కోహ్లీ అంత గొప్పోడా? ఆసక్తికర లెక్కలు వెలుగులోకి..

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్‌ చేయలేదు. స్వల్ప టార్గెట్‌ కావడంతో కెప్టెన్ రోహిత్‌ శర్మ, తన ఓపెనింగ్‌ స్పాట్‌ను త్యాగం చేయడంతో పాటు విరాట్‌ వన్‌డౌన్‌ ప్లేస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపించాడు. ఆ తర్వాత కూడా పాండ్యా, జడేజా, శార్దుల్‌లను ముందు పంపించడంతో టార్గెట్‌ పూర్తి అయింది. దీంతో కోహ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేశాడు. అయితే.. కోహ్లీ తనకు అచ్చొచ్చిన వన్‌డౌన్‌ ప్లేస్‌ను ఇప్పుడే కాదు గతంలో అనేకసార్లు త్యాగం చేశాడు.

వన్డేల్లో వన్‌డౌన్‌ ఎంతో కీలకం..
ఓపెనర్లు మంచి స్టార్ట్‌ ఇస్తే దాన్ని మిడిల్‌ ఓవర్స్‌లో కొనసాగించే బాధ్యత వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడిపై ఉంటుంది. అలాగే ఫస్ట్‌ వికెట్‌ త్వరగా పడితే.. పవర్‌ ప్లేలో ఆడుతూ ఓపెనర్‌ అవతారం ఎత్తాల్సి ఉంటుంది. అందుకే వన్‌డౌన్‌లో ఆడటం అంత ఈజీగా కాదు. కానీ, కోహ్లీకి వన్‌డౌన్‌ అచ్చొచ్చిన ప్లేస్‌. కెరీర్‌ ఆరంభం నుంచి వన్డేల్లో కోహ్లీ ఈ ప్లేస్‌లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్‌ బలం పెరిగిదంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ చూపించే నిలకడ ప్రపంచంలో మరే క్రికెటర్‌ కూడా చూపించలేడు. అంతెందుకు వన్డే ఫార్మెట్‌లో సచిన్‌ కంటే మెరుగైన ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు కోహ్లీ వన్డేలపై ఎలాంటి ముద్రవేశాడో. ఓపెనర్లు త్వరగా అవుటైనా ఆ ఒత్తిడి మిగతా బ్యాటర్లపై పడకుండా చేస్తాడు. అలాగే ఓపెనర్లు మంచి ఇన్నింగ్స్‌లు తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం ఇస్తే.. అదే స్పీడ్‌ను కొనసాగించి టీమ్‌కు పెద్ద స్కోర్‌ అందిస్తాడు. ఇక ఛేజింగ్‌లో కోహ్లీని మించిన బ్యాటర్‌ లేడంటే అతిశయోక్తి కాదు.

అలాంటి ఆటగాడు తన వన్‌డౌన్‌ ప్లేస్‌ను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 23 మ్యాచ్‌ల్లో త్యాగం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్‌, చేసే ప్రతి పరుగు.. చరిత్ర సృష్టించే వైపే సాగుతోంది. అది వ్యక్తిగతంగా కోహ్లీకి, జట్టుకి, దేశానికి కూడా గొప్పే. సచిన్‌ వంద సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమిస్తే.. అది భారత్‌కు గర్వకారణం. ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు సెంచరీల సెంచరీ రికార్డ్‌ ఉంటుంది. ప్రపంచంలో మరే ఆటగాడికి ఆ రికార్డు లేదు.. భవిష్యత్తులో ఉండబోదు కూడా. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో సచిన్‌ వంద సెంచరీల రికార్డును చేరుకునే అవకాశం, సత్తా ఉన్న ఆటగాడు ఒక్క​ కోహ్లీనే. అలాంటి ఆటగాడు పరుగులు చేసే ఏ ఒక్క ఛాన్స్‌ను కూడా వదులుకోడు. కానీ, కోహ్లీ అలా కాదు. తనకంటే కూడా జట్టుకు ఏది మంచో అదే చేస్తాడు.

ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇప్పుడే వెస్టిండీస్‌ వచ్చాడు. పైగా అతనికి కరేబియన్‌ గడ్డపై ఆడిన అనుభవం పెద్దగా లేదు. అలాగే రానున్న వన్డే వరల్డ్‌ కప్‌లో సూర్యను కీ ప్లేయర్‌గా వాడాలని టీమిండియా భావిస్తోంది. ఇలాంటి తరుణంలో సూర్యకు వీలైనంత ఎక్కువ గేమ్‌ టైమ్‌ ఇచ్చి, ఎక్కువ బంతులను ఎదుర్కొనే అవకాశం ఇస్తే.. భవిష్యత్తులో టీమిండియాకు మంచి జరుగుతుంది. అందుకే ఇంత ఆలోచించి.. తన బ్యాటింగ్‌ స్పాట్‌ను సూర్యకు ఇచ్చాడు. అలాగే రోహిత్‌ కూడా తన ఓపెనింగ్‌ స్పాట్‌ను ఇషాన్‌కు ఇచ్చాడు.

అయితే.. కోహ్లీ ఇప్పటి వరకు దాదాపు 23 సార్లు ఇలాంటి త్యాగం చేశాడు. అందులో సూర్యకుమార్‌ యాదవ్‌ కోసమే అత్యధికంగా 6 సార్లు, కేఎల్‌ రాహుల్‌ కోసం 4 సార్లు, రిషభ్‌ పంత్‌ కోసం 3 సార్లు, దూబే కోసం 2, శ్రేయస్‌ కోసం 2, శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ కోసం ఒక్కోసారి తన వన్‌డౌన్‌ ప్లేస్‌ను త్యాగం చేశాడు. ఇలా ఎంతో నిస్వార్థంగా తన ప్లేస్‌ను టీమ్‌లోని ఇతర ఆటగాళ్లకు ఇస్తూ.. వారిని ఫామ్‌లోకి తెచ్చేందుకో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునో తాను వేరే స్థానంలో ఆడుతున్నాడు. ఇదంతా చేసేది టీమ్‌ కోసమే. అందుకే కోహ్లీ నిజంగా గొప్పోడే. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వయసు అయిపోయిందంటారు.. వాళ్లు లేకుంటే టీమ్‌లో పసే లేదు!