iDreamPost
android-app
ios-app

రోహిత్‌ని చూసి ఎలా ఆడాలో కోహ్లీ నేర్చుకోవాలా? ఈ వాదనకి కారణం?

  • Published Apr 08, 2024 | 1:03 PMUpdated Apr 08, 2024 | 1:03 PM

Virat Kohli, Rohit Sharma, Strike Rate: ఐపీఎల్‌ 2024లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇద్దరు ఫామ్‌లో కొనసాగుతున్నారు. అయితే.. ఒక విషయంలో మాత్రం రోహిత్‌ శర్మను చూసి.. ఎలా ఆడాలో కోహ్లీ నేర్చుకోవాలని కొంతమంది కొత్త వాదను తెరపైకి తెస్తున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Virat Kohli, Rohit Sharma, Strike Rate: ఐపీఎల్‌ 2024లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇద్దరు ఫామ్‌లో కొనసాగుతున్నారు. అయితే.. ఒక విషయంలో మాత్రం రోహిత్‌ శర్మను చూసి.. ఎలా ఆడాలో కోహ్లీ నేర్చుకోవాలని కొంతమంది కొత్త వాదను తెరపైకి తెస్తున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 08, 2024 | 1:03 PMUpdated Apr 08, 2024 | 1:03 PM
రోహిత్‌ని చూసి ఎలా ఆడాలో కోహ్లీ నేర్చుకోవాలా? ఈ వాదనకి కారణం?

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చెలరేగి ఆడాడు. కేవలం 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు చేసి.. ముంబైకి ఫ్లయింగ్‌ స్టార్ట్‌ ఇచ్చాడు. రోహిత్‌ సెట్‌ చేసిన ప్లాట్‌ ఫామ్‌పై ముంబై ఇండియన్స్‌లోని మిగతా బ్యాటర్లు కూడా చెలరేగి ఆడి.. జట్టుకు 234 పరుగుల భారీ స్కోర్‌ అందించారు. దీంతో.. ముంబై ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీని 29 పరుగుల తేడాతో ఓడించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి.

అంతకు ముందు శనివారం ఆర్సీబీ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. కోహ్లీ సెంచరీ చేసినా.. అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ 27 బంతుల్లో 49 పరుగులు చేస్తూ.. వేగంగా ఆడటంతో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ని, వాళ్ల స్ట్రైక్‌రేట్‌ని కొంతమంది క్రికెట్‌ అభిమానులు కంప్యార్‌ చేస్తున్నారు. మరికొంత మంది అయితే.. టీ20ల్లో ఎలా ఆడాలో రోహిత్‌ శర్మను చూసి కోహ్లీ నేర్చుకోవాలని అంటున్నారు. మరి ఈ విషయంపై క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

Should Kohli learn from Rohit

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 156.94 స్ట్రైక్‌రేట్‌తో 72 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేశాడు. దీంతో.. కోహ్లీపై విమర్శలు వచ్చాయి. చాలా స్లోగా బ్యాటింగ్‌ చేసి.. సెంచరీ కోసం ఆడాడని కొంతమంది అంటున్నారు. కానీ, మ్యాచ్‌లో మరో ఓపెనర్‌గా ఉన్న ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 33 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్‌ 133.33 మాత్రమే. టీమ్‌లోని మిగతా ప్లేయర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. కోహ్లీ ఒక్కడే 72 బంతుల్లో 113 పరుగులు చేస్తే.. మిగిలిన నాలుగు బ్యాటర్లు 48 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేశారు. 11 పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. అయితే.. వేగంగా ఆడాలని మంచి బంతులకు కూడా అడ్డదిడ్డమైన షాట్‌ ఆడి కోహ్లీ అవుటై ఉండి ఉంటే.. ప్రస్తుతం ఆర్సీబీ ఉన్న పరిస్థితికి ఆ జట్టు స్కోర్‌ కనీసం 150 కూడా దాటకపోయేది.

పైగా కోహ్లీ గుడ్డిగా ఆడే బ్యాటర్‌ కాదు. ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ కూడా కోహ్లీనే. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉన్న టీమిండియా ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ. స్ట్రైక్‌రేట్‌ విషయంలో కోహ్లీకి రోహిత్‌ శర్మకి కేవలం 1.82 మాత్రమే తేడా. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు 139.97 స్ట్రైక్‌రేట్‌ ఉంటే.. కోహ్లీకి 138.15 స్ట్రైక్‌రేట్‌ ఉంది. అయితే.. రోహిత్‌ శర్మ 151 మ్యాచ్‌ల్లో 31.79 యావరేజ్‌తో 3974 పరుగులు చేస్తే.. కోహ్లీ కేవలం 117 మ్యాచ్‌ల్లోనే 51.75 యావరేజ్‌తో 4037 పరుగులు చేశాడు. ఈ ఒక్క విషయం చాలు.. కోహ్లీ టీ20ల్లో ఎంతటి ఇంప్యాక్ట్‌ చూపించాడో. రోహిత్‌ కంటే కోహ్లీనే బెస్ట్‌ టీ20 బ్యాటర్‌ అని చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ పండితులు అభిప్రాయపడ్డారు.

ఇక రోహిత్‌ శర్మ 27 బంతుల్లో 49 పరుగుల ఇన్నింగ్స్‌ను, కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగుల ఇన్నింగ్స్‌ను కంప్యార్‌ చేస్తే.. రెండూ మంచి ఇన్నింగ్సులే కానీ, ఇద్దరు ఆడే టీమ్స్‌ పరిస్థితి వేరు. ఆర్సీబీ టీమ్‌లో కోహ్లీ తప్పించి ఎవరూ బాగా ఆడటంలేదు. ఒక వేళ కోహ్లీ అవుట్‌ అయితే ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్‌ల్లో చూశాం. రాజస్థాన్‌పై డుప్లెసిస్‌ 33 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా టీ20ల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడితే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ప్రజర్‌ పడుతుంది. కానీ, కోహ్లీ ఆ ప్రెజర్‌ లోనై అడ్డదిడ్డమైన షాట్లు ఆడకుండా.. తనపై తానే భారం వేసుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ, ముంబైలో రోహిత్‌ పరిస్థితి వేరు. ముంబై బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉంది.

రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా వస్తున్న ఇషాన్‌ కిషన్‌ వేగంగా ఆడుతున్నాడు. వన్‌డైన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. చివర్లో టిమ్‌ డేవిడ్‌, షెఫర్డ్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వాళ్లు ఎలా ఆడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఒక వేళ​ వేగంగా ఆడే ప్రయత్నంలో రోహిత్‌ అవుటైనా.. మిడిల్డార్‌లో తిలక్‌ వర్మ, హార్ధిక్‌పాండ్యా లాంటి ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను బ్యాలెన్స్‌ చేయగలరు. కానీ, ఆర్సీబీలో అలాంటి పరిస్థితి లేదు. కోహ్లీ తప్పించి ఎవరిపై నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకే కాస్త టైమ్‌ తీసుకుని అయినా సరే కోహ్లీనే రన్స్‌ చేయాల్సిన పరిస్థితి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 49 పరుగుల వద్ద ఉన్న సమయంలో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు బాల్స్‌ డాట్‌ చేసి నాలుగో బంతికి అవుట్‌ అయ్యాడు. అంటే.. ఈ లెక్కన రోహిత్‌ శర్మ ఫిఫ్టీ కోసం ఆడుతూ.. ప్రెజర్‌కు లోనై అవుట్‌ అయ్యాడని అనడం సరికాదు.

రోహిత్‌ శర్మ, కోహ్లీల స్ట్రైక్‌రేట్‌ను సాకుగా చూపుతూ.. అనవసరపు కంప్యారిజన్స్‌ చేయడం కంటే.. వాళ్లు ఇప్పుడు ఆడుతున్న తీరు.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాకు ఎంతో సహాయపడుతుందని గుర్తించాలి. రోహిత్‌ శర్మ.. ఓపెనర్‌గా వచ్చి వేగంగా ఆడటానికి కారణం.. కాస్త అటూ ఇటూ అయినా వెనుక కోహ్లీ ఉన్నాడనే నమ్మకం. గతేడాది ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లో ఇదే స్ట్రాటజీని ఉపయోగించి.. టీమిండియా సూపర్‌ సక్సెస్‌ కూడా అయింది. టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా టీమిండియా ఇదే ప్లాన్‌తో ముందుకు వెళ్లడం ఖాయం. అయినా కోహ్లీ, రోహిత్‌ ఇద్దరూ వాళ్ల కోసం గేమ్‌ ఆడే ప్లేయర్లు కాదు.. టీమ్‌, దేశమే వాళ్లకు ముఖ్యం. అలాంటి ఆటగాళ్లను ఉద్దేశించి ఇలాంటి అనవసరపు కంప్యారిజన్స్‌ వేస్ట్‌ అంటూ క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి