11 ఏళ్లుగా దొంగిలిస్తున్నా! విండీస్‌ కీపర్‌తో కోహ్లీ ఆసక్తికర సంభాషణ

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్‌లో 76 పరుగులతో రాణించిన కోహ్లీ.. రెండో టెస్ట్‌లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో మరో 13 పరుగులు చేస్తే.. తన కెరీర్‌లో 76వ సెంచరీని సాధిస్తాడు. అయితే మొదటి టెస్ట్‌లోనే సెంచరీ చేస్తాడని భావిస్తే.. 76 పరుగుల వద్ద అవుటై అభిమానులను నిరాశపరిచాడు. అయితే ఆ లోటును రెండో టెస్టులో తీర్చేలా కనిపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే కోహ్లీ ఒక అరుదైన ఘనతను సైతం అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ కోహ్లీ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ అనే విషయం తెలిసిందే. ఇలా ఎంతో ప్రత్యేకమైన మ్యాచ్‌ను మంచి ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం 9 మంది క్రికెటర్లు మాత్రమే 500లకి పైగా మ్యాచ్‌లు ఆడారు. వారిలో ఏ ఒక్కరూ కూడా తమ 500వ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించలేదు. కానీ, కోహ్లీ మాత్రం ఆ రికార్డును అందుకున్నాడు.

అయితే.. రెండో టెస్ట్‌లో కోహ్లీ పరుగుల ప్రవాహం బౌండరీల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలోనే ఎక్కువగా వచ్చింది. వికెట్ల మధ్య కోహ్లీ ఎంత వేగంగా పరిగెత్తుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్‌ వచ్చే చోట రెండు, రెండు రన్స్‌ వచ్చే చోట మూడు పరుగులు తీస్తుంటాడు. అవి కనిపించకుండా వచ్చే పరుగులు. టీమ్‌కు ఊహించని స్కోర్‌ను అందిస్తాయి. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్ని.. డైవ్‌ చేస్తూ మరీ పరుగుల పూర్తి చేశాడు. ఈ క్రమంలో విండీస్‌ వికెట్‌ కపీర్‌ డిసిల్వా.. ‘నువ్వు డబుల్స్‌ దొంగిలిస్తున్నావ్‌’ అని కోహ్లీతో చెప్పగా.. దానికి కోహ్లీ స్పందిస్తూ.. ‘2012 నుంచి నేను డబుల్స్‌ను దొంగిలిస్తున్నాను’ అంటూ సరదాగా పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కోహ్లీ సరదాగా వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌ టీమ్‌ను బకరాలను చేసి.. సారీ చెప్పిన లంక బోర్డు!

Show comments