iDreamPost

ధోని టార్గెట్ అదే.. అలా బతకాలనేది అతడి కోరిక: వసీం జాఫర్

  • Author singhj Published - 05:25 PM, Fri - 7 July 23
  • Author singhj Published - 05:25 PM, Fri - 7 July 23
ధోని టార్గెట్ అదే.. అలా బతకాలనేది అతడి కోరిక: వసీం జాఫర్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు అతడు గుడ్​బై చెప్పి దాదాపుగా మూడేళ్లు కావొస్తోంది. అయినా మాహీ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అందుకు ఒక కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్​ అని చెప్పొచ్చు. టీమిండియాను వీడినప్పటికీ ఐపీఎల్​లో మాత్రం ధోని ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కెప్టెన్​గా ముందుండి నడిపిస్తున్నాడు. ఐపీఎల్​-2023 కప్​ను సీఎస్​కే గెలుచుకోవడంలో అతడి పాత్ర ఎంతో కీలకంగా చెప్పుకోవచ్చు. టోర్నీ ఆరంభంలో తడబడిన చెన్నైని.. ఫైనల్స్​కు చేర్చడమే గాక, టైటిల్​ను కూడా అందించాడు ధోని.

సత్తా ఉన్న యంగ్ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ, సీనియర్లకు కూడా అవకాశాలిస్తూ చెన్నై జట్టును అద్భుతంగా నడిపించాడు ఎంఎస్ ధోని. దీంతో ఐదోసారి ఐపీఎల్ కప్​ను తమ అకౌంట్​లో వేసుకుంది సీఎస్​కే. ఈ టోర్నీ ఫైనల్స్​ తర్వాత ధోని రిటైర్ అవుతాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్​ పదిహేడో సీజన్​లో ఆడేది లేనిది మరో తొమ్మిది నెలల తర్వాతే చెబుతానని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్​లో మోకాలి గాయంతోనే ఆడిన ధోని.. ఆ ఇంజ్యురీ నుంచి కోలుకుంటేనే వచ్చే సీజన్​లో ఆడగలడు. గాయానికి సర్జరీ చేయించుకున్న ధోని.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతడు ఎంత త్వరగా కోలుకుంటాడో చూడాలి.

ఇక, ధోని పుట్టిన రోజు సందర్భంగా అతడితో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పంచుకున్నాడు. ‘నేను 2005లో భారత జట్టులోకి వచ్చా. అప్పడు టీమ్​కు ధోని కొత్త. అతడు వన్డే క్రికెట్​లో ఆడితే.. నేను టెస్టుల్లో ఆడేవాడ్ని. నాతో పాటు నా భార్య, దినేష్ కార్తీక్, అతడి భార్య, ఆర్సీ సింగ్ వెనుక సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేం చాలా మాట్లాడుకునేవాళ్లం. ధోని రైల్వేస్​లో పనిచేసేవాడని అందరికీ తెలుసు. అప్పట్లో అతడు తన జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన లైఫ్ మొత్తం హాయిగా రాంచీలో గడపాలని ధోని అనుకునేవాడు. రాంచీని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనని చెప్పేవాడు. చాలా వినయంగా ఉండేవాడు. చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి