SNP
SNP
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం టీమిండియా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా టీమ్ను ఎంపిక చేశారు. ఆగస్టు మొదటి వారంలో ఈ సిరీస్ జరగనుంది. అయితే టీమ్ ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. అలాగే మరికొంతమంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై కూడా క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా రింకూ సింగ్ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
రింకూ సింగ్.. ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున గత రెండు సీజన్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. చివరి వరకు క్రీజ్లో నిలబడి ఒంటరి పోరాటం చేస్తూ.. మంచి ఫినిషర్గా పేరుతెచ్చుకున్నాడు. అలాంటి ఆటగాడి లోటు టీమిండియాలో చాలా కాలంగా కనిపిస్తోంది. అయినా కూడా రింకూ సింగ్ లాంటి యువ టాలెంట్ను టీమిండియా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. కొంతమంది ఆటగాళ్లు చాలా కాలంగా దారుణంగా విఫలం అవుతున్నా.. వారినే పట్టుకుని వేలాడుతున్నారు.
యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ లాంటి వారికి అవకాశం ఇచ్చినా.. రింకూ సింగ్కు కూడా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ దారుణంగా విఫలం అవుతున్నా అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జట్టు ఎంపికలో రాజకీయాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలను సైతం క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023లో రింకూ 14 మ్యాచ్ల్లో 59.25 యావరేజ్, 149.53 స్ట్రైక్రేట్తో 474 పరుగులు చేశారు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పైగా కొన్ని ఇన్నింగ్స్లు చరిత్రలో నిలిచిపోయేవి కూడా ఉన్నాయి. రింకూ పోరాట స్ఫూర్తికి ఫిదా కానీ క్రికెట్ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆటగాడికి టీ20 జట్టు స్థానం కల్పించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టు: ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, హర్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.