రోహిత్, కోహ్లీ కాదు.. అసలు పరీక్ష గంభీర్​కే! తప్పనిసరిగా దాటాలి!

Gautam Gambhir Faces Real Challenge: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అసలు పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ టెస్ట్​లో అతడు పాసై తీరాలి. ఒకవేళ రిజల్ట్ కాస్త తేడాగా వచ్చినా అతడు భారీగా విమర్శల్ని మూటగట్టుకోక తప్పదు.

Gautam Gambhir Faces Real Challenge: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అసలు పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ టెస్ట్​లో అతడు పాసై తీరాలి. ఒకవేళ రిజల్ట్ కాస్త తేడాగా వచ్చినా అతడు భారీగా విమర్శల్ని మూటగట్టుకోక తప్పదు.

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సిద్ధంగా ఉంది టీమిండియా. రెండు టెస్టుల ఈ సిరీస్​ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవడమే మిగిలింది. వారం కిందే చెపాక్​కు చేరుకున్న రోహిత్ సేన.. సిరీస్ కోసం భీకరంగా ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లంతా నెట్స్​లో తీవ్రంగా చెమటలు చిందించారు. బంగ్లాను చిత్తు చేయాలనే పట్టుదలతో ప్రాక్టీస్ సెషన్​లో రెట్టింపు కష్టపడ్డారు. ఈ సిరీస్​ టీమిండియాకు కొన్ని సవాళ్లు విసురుతోంది. అయితే చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్ బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మనో కాదు.. ఈ సిరీస్​తో అసలు ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు హెడ్ కోచ్ గంభీర్. ఇది అతడికి అగ్నిపరీక్షగా మారింది. ఈ రియల్ టెస్ట్​లో గౌతీ నెగ్గి తీరాల్సిందే.

గంభీర్​ కోచ్​గా రావడానికి ముందు విపరీతమైన హైప్ నెలకొంది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే తీసుకోవాలంటూ అటు వెటరన్ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. గంభీర్ కొత్త కోచ్​గా వస్తే భారత్ సాధించని డబ్ల్యూటీసీ ట్రోఫీతో పాటు ఇతర ఐసీసీ కప్పులు కూడా కొట్టేయడం ఖాయమంటూ జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఆయన కోచ్​గా వచ్చాక తొలి సిరీస్​లో మిక్స్​డ్ రిజల్ట్స్ చూశాడు. శ్రీలంక సిరీస్​తో కోచ్​గా బాధ్యతలు చేపట్టాడీ లెజెండ్. అయితే పసికూన స్థాయికి పడిపోయిన ఆ టీమ్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఎలాగోలా నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్​లో మాత్రం ఓటమిపాలైంది. రోహిత్, కోహ్లీ, రాహుల్, అయ్యర్ లాంటి హేమాహేమీలు టీమ్​లో ఉన్నా.. కోచ్​గా గంభీర్ వెనుక నుంచి నడిపించినా టీమ్​ ఫెయిలైంది. అయినా గౌతీ కోచింగ్​పై పెద్దగా విమర్శలు రాలేదు.

గంభీర్ కోచ్​గా సెటిల్ అవడానికి, టీమిండియా ఎన్విరాన్​మెంట్​ను అర్థం చేసుకోవడానికి ఇంకొంత సమయం అవసరమనే ఉద్దేశంతో లంకతో వన్డే సిరీస్​లో ఓడినా ఆయన్ను ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో మరో కఠిన సవాల్ ఎదురవుతోంది. బంగ్లా ఒకప్పటిలా లేదు. బ్యాటింగ్, బౌలింగ్​లో ఆ టీమ్ మంచి బ్యాలెన్స్​తో ఉంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లు తప్పు చేస్తే కుప్పుకూల్చాలని వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పాకిస్థాన్​ను క్లీన్​స్వీప్ చేసిన జోష్​లో ఉన్నారు. అందుకే బంగ్లాను లైట్ తీసుకోకుండా ఆటగాళ్లందర్నీ వారం ముందు నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు గౌతీ. రోహిత్​తో కలసి బంగ్లా కోసం స్పెషల్ ప్లాన్స్ కూడా రెడీ చేశాడు. అయితే సిరీస్ పూర్తయ్యే వరకు ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలి.

గంభీర్​కు ఇది రియల్ టెస్ట్ టైమ్. బంగ్లాను చిత్తుగా ఓడించి వైట్​వాష్ చేసే వరకు ఆయన వదలొద్దు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ జట్టు షాక్ ఇస్తుంది. అందుకే ప్రతి సెషన్​ను సీరియస్​గా తీసుకొని టీమ్​ గెలుపు తీరాలకు చేరే వరకు గౌతీ విశ్రమించకూడదు. బంగ్లాను ఓడిస్తే ఓకే.. కానీ రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా తొలి దెబ్బను రుచి చూడాల్సింది గంభీరే. ఆ తర్వాతే రోహిత్​తో పాటు ఇతర టీమ్​మేట్స్​పై విమర్శలు రావొచ్చు. ఒక్క మ్యాచ్ ఓడినా గౌతీ కోచింగ్, అతడి సామర్థ్యంపై లేనిపోని అనుమానాలు, సందేహాలు కమ్ముకునే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గుర్తించి ఆయన మరింత అలర్ట్​గా ఉంటే బెటర్. రోహిత్, కోహ్లీ, అశ్విన్, బుమ్రా లాంటి సీనియర్ల అండ ఉంది. టీమ్ దుర్భేద్యంగా ఉంది. కాబట్టి ఎలాంటి సంచనాలు జరగకపోవచ్చు. కానీ ఒక్క సెషన్​లో రిజల్ట్ మారిపోయే టెస్టుల్లో బంగ్లా లాంటి డేంజరస్ టీమ్​ను తేలిగ్గా తీసుకోకూడదు. ఇవన్నీ గంభీర్ దృష్టిలో పెట్టుకుంటే మంచిదని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.

Show comments