జింబాబ్వేపై యువీ శిష్యుడి ఊచకోత..! సిక్సర్లతో శివాలెత్తాడుగా..

Abhishek Sharma, IND vs ZIM, Yuvraj Singh: పసికూన జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురింపి.. అలవోకగా సెంచరీ సాధించాడు. అతని ఊచకోత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Abhishek Sharma, IND vs ZIM, Yuvraj Singh: పసికూన జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురింపి.. అలవోకగా సెంచరీ సాధించాడు. అతని ఊచకోత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత.. టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యంగ్‌ టీమిండియాను తొలి మ్యాచ్‌లో ఓడించి.. ఊచించని దెబ్బ కొట్టింది జింబాబ్వే. తొలి ఎదురుదెబ్బ నుంచి వేగంగా కొలుకున్న యంగ్‌ ఇండియా.. ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అన్న రీతిలో రెండో టీ20లో జింబాబ్వే జట్టును చావుదెబ్బ కొట్టింది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో భారత కుర్రాళ్లు ఏకంగా వంద పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేశారు. తొలి మ్యాచ్‌ గెలిచి.. సంతోషంలో ఉన్న ఆ జట్టును.. పసికూనలనే విషయాన్ని వారికి మరోసారి గుర్తుచేసింది గిల్‌ సేన. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత దిగ్గజ క్రికెటర్‌ తయారు చేసిన ఓ ఏకే47 అద్భుతంగా పేలింది.

ఆ ఏకే47 నుంచి తూటాల్లాంటి సిక్సర్లు దూసుకొచ్చాయి. అభిషేక్‌ శర్మ అనే ఈ ఆయుధాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా? టీమిండియా రెండు వరల్డ్‌ కప్‌లు అందించిన హీరో యువరాజ్‌ సింగ్‌. అతని గైడెన్స్‌ అండ్‌ కోచింగ్‌లో అద్భుతంగా రాటుదేలిన అభిషేక్‌ శర్మ.. తన రెండో టీ20 మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో టీ20 సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో డకౌట్‌ అయి.. అందరికి షాకిచ్చిన అభిషేక్‌.. తన అసలు సత్తా ఏంటో రెండో మ్యాచ్‌లో చూపించాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ బాదేసి.. గురువు యువరాజ్‌కు దగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. మొత్తంగా 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 2 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. అభిషేక్‌ సెంచరీకి తోడు.. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ 47 బంతుల్లో 77, అలాగే పాకెట్‌ డైనమైట్‌ రింకూ సింగ్‌ 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేసి అదరగొట్టడంతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. ఇక 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ చేసి పడేశారు. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మాధేవెరే 43, ల్యూక్ జోంగ్వే 33 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. టీమిండియా బౌలర్లలో ముఖేష్‌ కుమార్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌ 3, రవి బిష్ణోయ్‌ 2 వికెట్లతో రాణించారు. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మొత్తంగా అభిషేక్‌ శర్మ షోతో.. టీమిండియా 1-1తో ఈ సిరీస్‌ సమం చేసి.. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి గట్టి బదులు తీర్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ సూపర్‌ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments